Success stories of women radido riders in AP:  ఆంధ్రప్రదేశ్ మహిళలు  మెప్మా సహకారంతో స్వయం ఉపాధి పొందుతూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతిలోని స్మార్ట్ ఫోన్‌ ఉపయోగిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ సొంతంగా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర నగరాల్లో మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సొంత కాళ్లపై నిలబడేందుకు ర్యాపిడో ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు.

సబ్సిడీపై మహిళలకు వాహనాలు ఇచ్చిన ప్రభుత్వం  

మహిళల స్వయం ఉపాధికి తొలి అడుగు ఈ ఏడాది మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పడింది. అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడంతో మొదలైంది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రారంభించిన “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త” కింద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్ (మెప్మా) సంస్థ ర్యాపిడో ద్వారా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించింది. అందులో భాగంగా తొలి దశలో తొమ్మిది పట్టణాల్లో 1000 మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించారు. వీటిలో విశాఖపట్నంలో 400 వాహనాలు , విజయవాడలో 400, నెల్లూరు, గుంటూరులో 50 చొప్పున, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 25 వాహనాలు చొప్పున మహిళలకు అందజేశారు. వీటిలో 760 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కాగా, 240 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఉన్నాయి. ఈఎంఐలకూ ప్రభుత్వ సాయం 

ఈ వాహనాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు డ్వాక్రా సంఘాల మహిళల పేర్లతో మంజూరయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వారి కుటుంబ సభ్యులు వాహనం నడిపేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్టులను మెప్మా సిద్ధం చేసి, జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా సహకారం అందించింది. ర్యాపిడో సైతం మహిళలకు సాధికారతనందించడంలో భాగస్వామ్యం కావడం విశేషం. కొత్తగా చేరిన వారికి ప్లాట్‌ఫామ్ ఫీజులో మూడు నుంచి నాలుగు నెలల మినహాయింపు ఇచ్చారు. అలాగే తొలి సంవత్సరం టూ-వీలర్, త్రీ-వీలర్ యజమానులకు నెలకు వెయ్యి రూపాయల ఈఎంఐ మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో ర్యాపిడో నడపడం ప్రారంభించిన గృహిణులకు తొలి రోజు నుంచే ఆదాయం ప్రారంభమైంది. అలాగే ఈఎంఐ, ఇంధన భారం కూడా తగ్గింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1003 కుటుంబాలు లబ్ధి పొందగా, వారిలో 688 మంది ర్యాపిడోలో నమోదు అయ్యారు.  భారీగా సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం 

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రూ. 12,300 నుంచి ఆటోలకు రూ.36,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. మరోవైపు ప్రభుత్వ చొరవకు తమ వంతు సహాయంగా ర్యాపిడో ఈఎంఐ విషయంలో ఫీజు మినహాయింపునిచ్చింది. ఈ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ కావడంతో ఇంధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ర్యాపిడో నడుపుతున్న మహిళలు నెలకు సుమారు రూ. 13 నుంచి 16 వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.  మెప్మా సహకారంతో ర్యాపిడో నడుపుతున్న మహిళా డ్రైవర్లు కేవలం మూడు నెలల్లో (మే, జూన్, జూలై) రికార్డు స్థాయిలో 45 వేల రైడ్లు పూర్తి చేశారు. మొత్తంగా రూ.35 లక్షల ఆదాయం సంపాదించారు. మహిళల విజయగాథల స్ఫూర్తితో రాబోయే ఏడాదిలో మరో 4 వేల 800 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళా శక్తికి మరింత సాయం 

మహిళలు సాధికారత సాధించాలనేది ప్రభుత్వ ఆలోచన అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడంతోపాటు, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ర్యాపిడోతో కలిసి రాష్ట్రంలో 1000 మందికి పైగా మహిళలు స్వీయ ఉపాధి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత చేస్తామని మంత్రి నారా లోకేష్ వివరించారు.