TDP National Committee |  టిడిపి నేతలు ఎప్పటి నుచో ఎదురుచూస్తున్న పార్టీ పదవుల ప్రకటన ఎట్టకేలకు వచ్చేసింది. నామినేటెడ్ పదవులు దక్కని వారికి  చెప్పినట్టుగానే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ఎంపిక మొత్తంలో  నారా లోకేష్ ముద్ర కొట్టొచ్చినట్టు కనపడింది. నెమ్మదిగా పార్టీని ఆయన టేక్ ఓవర్ చేస్తున్న సూచనలు బలంగా కనిపించాయి. 29 మందితో పాలిట్ బ్యూరో,31 మందితో జాతీయ కమిటీ, 185  మందితో రాష్ట్ర కమిటీ లు ఏర్పాటు చెయ్యగా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ప్రమోట్ అయ్యారు.

Continues below advertisement

లోకేష్ గత పదవులు ఆయన సన్నిహితులకే 

 నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ రావడంతో ఇప్పటి వరకూ ఆయన నిర్వహిస్తున్న పదవులు ఆయన సన్నిహితులకే దక్కాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ముగ్గురికి పంచారు. కేంద్ర మంత్రి  రామ్మోహన్ నాయుడు,ఎంపీ బైరెడ్డి శబరి, లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఎంపికయ్యారు. 

Continues below advertisement

 సామాజిక వర్గీకరణ ఆధారంగా సీనియర్ లకు పోస్టులు 

ఈసారి టిడిపి పదవుల ఎంపికలో సీనియర్లకు సామాజిక వర్గం ఆధారంగా పోస్టులు దక్కాయి. పోలిట్ బ్యూరో సభ్యులు గా యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, పిఠాని సత్యనారాయణ, వర్ల రామయ్య, నందమూరి బాలకృష్ణ వంటి వారి ఎంపిక లో ఇది కనపడింది. 

సీనియర్ లకు జాతీయ పదవులు 

పార్టీలోని సీనియర్లకు  జాతీయ పదవులు కేటాయించారు. అదే విధంగా ఇంతవరకు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసిన వారికి జాతీయ అధికార ప్రతినిధులుగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ కోటా లో పట్టాభి, సోమిరెడ్డి, దీపక్ రెడ్డి, నర్సిరెడ్డి లాంటి వారికి ప్రమోషన్ దక్కింది. పార్టీ జాతీయ కోశాధికారిగా  కొనికళ్ళ నారాయణకు పదవినిచ్చి గౌరవించారు.

'యువగళం' టీమ్ కు ప్రాధాన్యత 

 లోకేష్ రాజకీయ చరిత్రలో గేమ్ చేంజర్ గా చెప్పుకునే "యువగళం ' యాత్ర లో  కీలకం గా పనిచేసిన యంగ్ టీమ్ కు ఈసారి పార్టీ పదవుల్లో పెద్దపీట వేశారు.  చాలామందికి రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. యువగళం టీమ్ లో కష్టపడిన చింతకాయల విజయ్, పాశం సునీల్ కుమార్ లకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. అలాగే ఎమ్మెల్యేలలో చాలామందికి  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవులు ఇచ్చారు. వారితోపాటు  కార్పొరేషన్లకు చైర్మన్ లుగా పనిచేస్తున్న వారికి కూడా ఉపాధ్యక్షులుగా రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. అలాగే పార్టీ విపక్షంలో ఉన్న టైంలో  అండగా నిలబడిన వారికి స్థానికంగా ఉన్న నేతల వ్యతిరేకత ఉన్నప్పటికీ  పదవులు కట్టబెట్టారు. అలాంటివారిలో  కొవ్వూరు నియోజకవర్గం లో మాజీ మంత్రి KS జవహర్ కుమారుడు ఆశీష్ లాల్ ఒకరు. తనకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. 

పూర్తిగా లోకేష్ టీమ్ తో నిండి పోయిన పార్టీ పదవులు 

 ఈసారి పార్టీ పదవులు మొత్తం లోకేష్ టీం తో నిండిపోయిన చెప్పాలి. సీనియర్లను జాతీయస్థాయి కమిటీల్లో నియమించి గౌరవించినా గ్రౌండ్ లెవెల్ పెత్తనంతా లోకేష్ టీం కే దక్కింది. అలాగే యువకులకు ఈసారి పెద్దపీట వేయడం  పార్టీలో మొదలైన నాయకత్వ మార్పుకు సంకేతంగా నిలిచింది. అలాగే కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి  పార్టీ అండగా నిలబడింది అనే సంకేతాన్ని  క్షేత్రస్థాయిలోకి ఈ కమిటీ ల ఎంపిక ద్వారా బలంగా పంపే ప్రయత్నం చేసింది టీడీపీ. మరి దీనిపై గ్రౌండ్ లెవెల్ పార్టీ కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.