AP Liquor Shops Lottery Process Completed: ఏపీలో లిక్కర్ షాపుల (AP Liquor Shops) కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు సాగింది. ఈ క్రమంలో లాటరీ కేంద్రాలు ఉదయం నుంచే జనజాతరను తలపించాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డ్రాలో విజేతలకు అధికారులు లైసెన్స్ ఇవ్వనున్నారు.


ఈ నెల 16 (బుధవారం) నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ యూపీ రాష్ట్రాల నుంచి పలువురు టెండర్లు వేసి షాపులను దక్కించుకున్నారు. షాపు పొందిన వారి నుంచి డబ్బులు కట్టించుకొని అధికారులు సోమవారం ప్రొవిజినల్ లైసెన్స్ ఇస్తున్నారు. డ్రాలో షాపు దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. మంగళవారం సాయంత్రం డిపోలో స్టాక్ తీసుకుని ఈ నెల 16న వ్యాపారులు దుకాణాలు తెరవనున్నారు. సోమవారం సాయంత్రం వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. అనంతరం షాపులు దక్కించుకున్న వారు మద్యం అమ్మకాలు నిర్వహిస్తారు. కాగా, 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేట్ మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాగా.. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు మొత్తం 76 వేల దరఖాస్తులు వచ్చాయి.


మహిళలదే హవా


లిక్కర్ షాపుల డ్రాలో మహిళలే ఎక్కువ షాపులను దక్కించుకున్న తెలుస్తోంది. విశాఖ, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో మహిళలే మద్యం దుకాణాలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 11 షాపులను కైవసం చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు లాటరీలో 3 నుంచి 5 షాపుల వరకూ దక్కినట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు 5 నుంచి 10 షాపులు దక్కినట్లు సమాచారం. కొందరు సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో నిరాశ చెందారు.


లాటరీ సిత్రాలు


లాటరీ సందర్బంగా కొందరిని అదృష్టం వరించినట్లే అనిపించి నిరాశ చెందేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా అంబేడ్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా.. ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ దుకాణానికి సంబంధించిన డ్రాలో 9వ నెంబర్ వస్తే దాన్ని అధికారులు పొరపాటున 6 అని మైక్‌లో బహిరంగంగా అనౌన్స్ చేశారు. దీంతో 6వ నెంబర్ దరఖాస్తుదారుడు సంబరపడ్డాడు. అయితే, 6ను తిప్పితే 9 అవుతుందని.. దాన్ని క్రాస్ చెక్ చేయాలని అధికారులను కోరగా.. అది 9గా తేలడంతో అలానే ప్రకటన చేశారు. దీంతో 6వ నెంబర్ వ్యక్తి తీవ్ర నిరాశకు గురై కావాలనే నెంబర్ మార్చారని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అధికారులు సద్దిచెప్పగా వివాదం సద్దుమణిగింది. అటు, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి ఏకంగా 5 దుకాణాలను దక్కించుకున్నారు.


 


Also Read: YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు