ఏపీ వ్యాప్తంగా నేడు కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ సర్వీసులు నిలిచిపోయాయి. రెండో రోజు కూడా సర్వర్ డౌన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలవడంతో జనం అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో భూముల విలువ పెరుగుతుంది అనే ప్రకటనతో పెద్ద ఎత్తున భూలావాదేవీలు జరిపిన వారు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు పోటెత్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట ప్రజలు బారులు తీరారు. ఎల్లుండి నుంచి చలానాలు పెంచడంతో సామాన్యులపై అధిక భారం పడుతుందని భావించి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ పని చేయకపోవడంతో దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు పక్కన పెట్టేశారు. రిజిస్ట్రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.


నాలుగు రోజుల క్రితం చలానా కట్టినా.. సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్ కాలేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ భూములకు ధరలు పెంచొద్దని, నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.