Kurnool Bus Fire Accident: కర్నూలు బస్ ప్రమాద ఘటనలో షాకింగ్ ట్విస్ట్- తాగి బైక్ నడిపిన శివ- ఫేక్ సర్టిఫికెట్స్తో లైసెన్స్ పొందిన డ్రైవర్ అరెస్టు
Kurnool Bus Fire Accident: అడుగడుగునా తప్పులు కారణంగానే కర్నూలులో వీ కావిరీ బస్ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అన్ని వ్యవస్థ పూర్తి వైఫ్యం కారణంగానే 20 మంది సజీవదహనమయ్యారని స్పష్టమవుతోంది.

Kurnool Bus Fire Accident: కర్నూలు హైవేపై జరిగిన వీ కావేరీ బస్ ప్రమాదంతో ఏ స్థాయిలో రూల్స్ బ్రేక్ అయ్యాయో అర్థమవుతోంది. ఈ ప్రమాదానికి కారణమైన బైక్ డ్రైవర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. అంతే కాదు బస్ నడిపిన డ్రైవర్ కూడా ఫేక్ సర్టిఫికెట్స్తో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు చెబుతున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలా అడుగడుగునా రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై శవపేటికలను నడిపిస్తున్నారు.
తాగి బైక్ నడిపిన శివ!
కర్నూలు బస్ ప్రమాదానికి అసలు కారణం రోడ్డుపై బైక్ ప్రమాదం. పల్సర్ నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆ బైక్ నడిపిన వ్యక్తి పేరు శివ. అతను మద్యం మత్తులో ఉన్న సంగతి ఓ పెట్రోల్ బంకులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్లో వెలుగు చూసింది. ఊగుతూ బైక్ నడుపుతున్న ఆ కుర్రాడి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరగడానికి ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో అతను తన ప్రెండ్తో కలిసి పెట్రోల్ కొట్టించాడు. అక్కడే బైక్ నడుపుతూ స్కిడ్ అయిన సంగతి ఆ వీడియోలో ఉంది. తర్వాత కంట్రోల్ చేసుకున్నాడు. అలా బైక్ నడుపూత వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు.

డ్రైవర్ లక్ష్మయ్య అరెస్టు
ఈ దుర్ఘటనలో వెలుగు చూసిన మరో దుర్ఘటన బస్ డ్రైవర్ నకిలీ సర్టిఫికెట్స్ బాగోతం. హెవీ లైసెన్స్ పొందాలంటే కనీసం విద్యార్హతలు ఉండాలి. అందుకే పదో తరగతి పాసైన వాళ్లకు మాత్రమే హెవీ లైసెన్స్ ఇస్తారు. కానీ వీ. కావేరీ బస్ నడిపిన డ్రైవర్ లక్ష్మయ్య మాత్రం పదోతరగతి పాస్ కాలేదు. తాను పదోతరగతి పాస్ అయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తేలింది. అంతే కాకుండా ప్రమాదం జరిగిన తర్వాత కనీసం బస్ను అక్కడే వదిలేసి పాసింజర్స్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పారిపోయాడు. ఆ తర్వాతే అగ్ని వ్యాపించి బస్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. అందుకే లక్ష్మయ్యను పల్నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారించి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోనున్నారు.
జాతీయ రహదారి గుంతులమయం
ప్రమాదం జరిగిన 44వ నెంబర్ జాతీయ రహదారిపై వందల లారీలు, వందల బస్లు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. అంటే బెంగళూరు- హైదరాబాద్ మధ్య కీలకంగా ఉంటుందీ రోడ్డు. అలాంటి ఎంతో కీలకమైన రహదారి నిర్వహణలో అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గుంతలు కనిపిస్తున్నాయి. నిర్వహణ లోపం కారణంగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరుచుకోలేకపపోయింది. ఇప్పుడు 20 మందిని పొట్టన్న పెట్టుకుంది. ఈ రహదారిపై వంద కిలోమీటర్లకు మించి వేగంతో వాహనాలు నడపకూడదు. కానీ ప్రైవేటు బస్ల వాళ్లు 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడుపుతున్నారు. గమ్యానికి త్వరగా చేరుకోవాలన్న ఆశతో మితిమీరిన వేగంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.





















