కర్నూలు: కర్నూలు జిల్లాలో రెండు రోజుల కింద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక మృతదేహం మినహా మిగతా డెడ్బాడీస్ను డీఎన్ఏ టెస్టుల అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు తీసుకున్న చర్యలు, తుది నివేదిక వివరాలను కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ వెల్లడించారు.
డీఎన్ఏ ఆధారంగా 18 మృతదేహాల అప్పగింత
వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడం కష్టమైంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మృతదేహాలకు, వారి కటుుంబసభ్యులకు డీఎన్ఏ టెస్టులు నిర్వహించింది. ఆ నివేదిక ఆధారంగా గుర్తించిన 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ. సిరి స్వయంగా పర్యవేక్షించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా కుటుంబాలకు అందించారు. ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అంబులెన్స్లను అధికారులు ఏర్పాటు చేశారు.
మరో మృతదేహం గుర్తింపు ప్రక్రియ పెండింగ్
ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికుల్లో మొత్తం 19 మంది సజీవ దహనం కాగా, 18 మృతదేహాలను అప్పగించారు. మరో గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి తమ తండ్రి కనిపించడం లేదంటూ చిత్తూరు నుంచి ఒక వ్యక్తి వచ్చారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి డీఎన్ఏ టెస్టుల నివేదిక ఆధారంగా మృతదేహాన్ని అప్పగిస్తామని తెలిపారు.
బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు
ప్రమాదానికి గల కారణాలపై నెలకొన్న అనుమానాలపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించారు. ఈ ప్రమాదంపై జరిగిన విచారణలో భాగంగా వచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో తేలినట్లు స్పష్టం చేశారు. రోడ్డు మీద అదివరకే పల్సర్ బైక్ పడిపోవడం, అది గుర్తించకుండా ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లడంతో నిప్పురవ్వలు రావడం, మంటలు వ్యాపించి నిమిషాల్లో బస్సు కాలి బూడిదైందని తెలిపారు. కొందరు బస్సు అద్దాలు పగలగొట్టి కిటికీ నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.