Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖాజీపేట: వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేష్ తల్లి సుజాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కుమారుడికి, కీర్తనకు మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు తనకు ముందుగా తెలియదని, అయితే వెంకటేష్ జేబులో దొరికిన ఒక లేఖ ద్వారా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న విషయం అర్థమైందని ఆమె పేర్కొన్నారు. తన కొడుకు వారి కూతురు వెంట పడుతున్న విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసినా, ఆ విషయాన్ని తనకు ఎప్పుడూ చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కీర్తన మోసం చేసిందని చెప్పాడు
హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ.. ఆ రోజు వెంకటేష్ బయటకు వెళ్లి కొద్దిసేపటికే ఇంటికి తిరిగి వచ్చాడని, తనను గట్టిగా హత్తుకుని ఎంతో ఏడ్చాడని సుజాత తెలిపారు. కీర్తన తనను ప్రేమ విషయంలో మోసం చేసిందని, ఆ విషయం నిలదీయడానికి వెళ్తే ఆమె కత్తి తీసుకుని గొంతు కోసుకుంటానని బెదిరించిందని వెంకటేష్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఆ పెనుగులాటలోనే కీర్తన గొంతు తెగిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియక భయంతో ఇంటికి వచ్చేశానని తన కొడుకు చెప్పాడని ఆమె పేర్కొన్నారు.

తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి
తన కుమారుడు అమాయకుడని, ఇంతటి ఘోరానికి ఒడిగడతాడని తాను అనుకోవడం లేదని సుజాత అన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే తన కొడుకును చట్టపరంగా శిక్షించాలని కోరారు. చట్టం ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో (ఎన్కౌంటర్ లేదా మరేదైనా) శిక్షించాలనుకుంటే, తన కుమారుడితో పాటు తనను కూడా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
గొంతుకోసి హత్య చేశాడని ఆరోపణలు..
ఖాజీపేటలో ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఉన్మాదిగా మారిన వెంకటేష్ అనే యువకుడు, 17 ఏళ్ల రామకీర్తన ఇంటిలోకి చొరబడి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 14న పుట్టినరోజు జరుపుకోవాల్సిన బాలిక, అంతలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారు అతని కాళ్లపై కాల్పులు జరిపి బంధించారు. ప్రస్తుతం గాయపడిన నిందితుడు రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ 14న ఆమె పుట్టినరోజు ఉండటంతో పండగలా ఉండాల్సిన ఇంట్లో ఈ దారుణం విషాదాన్ని నింపింది.
రామకీర్తన హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున మైదుకూరు నుండి తరలిస్తుండగా, బసాపురం చెక్పోస్ట్ వద్ద నిందితుడు కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో, ఆత్మరక్షణ కోసం అనివార్యంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వెంకటేష్ రెండు మోకాళ్లకు గాయాలవ్వగా, ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పట్టపగలే జరిగిన ఈ ఘోర హత్యపై స్థానికులు, బంధువులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన పోలీసు కాల్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























