Kunrool News : ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్న ఘటనలు పెరిగాయి. చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీవ్రంగా కొడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక చున్నీ వేసుకోలేదని పీఈటీ ప్రతాపం చూపింది. ఇనుప కడ్డీ కాల్చి విద్యార్థిని బుగ్గపై వాత పెట్టాంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. కొత్తపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతుంది. విద్యార్థిని చున్నీ వేసుకోకుండా స్కూల్ కు రావడంతో ఆగ్రహానికి గురైన పీఈటీ ఆమెను ఆడుకోనివ్వలేదు. అంతటితో ఆగకుండా ఇనుప కడ్డీ వేడిచేసి బాలిక చెంపపై వాత పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని ఆందోళన చేశారు. పీఈటీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  


విద్యార్థులపై డీన్ ప్రతాపం 


హన్మకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులపై డీన్ ప్రతాపం చూపాడు. హన్మకొండ హంటర్ రోడ్డులోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులపై డీన్ ప్రతాపం చూపాడు. తన ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదని చర్మం కమిలిపోయేలా కర్రతో చితకబాదాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. కమిలి పోయిన దెబ్బలు చూసి కూడా కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలన్న ఆలోచన చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పిల్లలపై ఏవిధంగా పర్యవేక్షణ చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. పైగా ఈ విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడు మోషన్ వెళ్లేందుకు కూడా కూర్చొలేని స్థితిలో ఉన్నాడని తండ్రి తెలిపారు. ఆదివారం తన కుమారుడిని చూసేందుకు వచ్చిన సమయంలో ఆయన ఫోన్ ద్వారా జరిగిన విషయాలు తన తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు స్కూల్ కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీన్ పై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదంటూ ప్రిన్సిపాల్ వద్ద పంచాయితీ పెట్టారు. అయితే విద్యార్థులపై చేయి చేసుకున్న డీన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. 


ఉపాధ్యాయుడికి బడితపూజ


 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యoగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు వచ్చి టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు వెంకట రమణను తల్లిదండ్రులు చితకబాదారు. వెంకటరమణ మోడ్రన్ పబ్లిక్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.  


"ఆ సార్ మాకు సైన్స్ చెబుతాడు. కారణంగా లేకుండా టచ్ చేస్తుంటాడు. నన్నే చూడండి అంటుంటాడు. చూసి నవ్వుతుంటాడు. ల్యాబ్ లో మార్కులు వేసేందుకు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు." - విద్యార్థిని