Gudivada News : కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు వీర్వో మధ్వ వివాదం చోటుచేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీఆర్వో పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళా కానిస్టేబుల్ వీర్వో పై దాడికి దిగి ఎదురు కేసు నమోదు చేయటంపై స్థానికులు మండిపడుతున్నారు. గుడివాడ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాశంగా మారింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు చేశారు.  అనిల్ కుమార్ అనే వీఆర్వో తన భార్య అంగన్ వాడీ కార్యకర్తతో కలిసి గుడివాడ రైల్వేస్టేషన్ కు వచ్చారు. పోలీసులు అనిల్ కుమార్ భార్యను ఆపేందుకు యత్నించారు. అయితే అదే సమయంలో అనిల్ కుమార్ తన వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిచటంపై మహిళా కానిస్టేబుల్ అనిల్ చెంపపై కొట్టింది. ఈ క్రమంలోనే అనిల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి కొరికాడని మహిళా కానిస్టేబుల్ ఆరోపించింది. అయితే తోటి అంగన్ వాడీలు మాత్రం అనిల్ మహిళా కానిస్టేబుల్ తో గొడవపడలేదని అంటున్నారు. మరో వైపున అనిల్ తన చెయ్యి కొరికాడంటూ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో, అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


"అంగన్ వాడీ టీచర్స్, సిబ్బంది చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతిలేదు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద నిఘా ఏర్పాటుచేశాం. కాటూరి అనిల్ కుమార్ అనే వీఆర్వో అతడి భార్య అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెను విజయవాడకు పంపించేందుకు రైల్వే స్టేషన్ వద్ద దిగబెట్టాడు. ఆ సందర్భంలో పోలీసు సిబ్బంది విజయవాడ వెళ్లడానికి అనుమతిలేదని అతడి భార్యను అడ్డుకున్నారు. అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగి , విధులకు ఆటంకం కల్గించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పై అధికారులకు సమాచారం ఇచ్చాం. పై అధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం. " - పోలీసులు 


"కానిస్టేబుల్ అంగన్ వాడీ టీచర్ ఫోన్ ఇవ్వమన్నారు. మా ఆవిడ ఫోన్ ఎందుకు మేము వెళ్లిపోతున్నామని అనిల్ బండి స్టార్ట్ చేయబోయారు. ఇంతలో కానిస్టేబుల్ బండి తాళం తీసుకున్నారు. నా బండి తాళం ఎందుకు తీసుకున్నారని అనిల్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ వెంటనే అనిల్ చెంపపై కొట్టింది. లేడీ కానిస్టేబుల్ వీఆర్వో చెంపపై రెండు సార్లు కొట్టింది. చేయి కొరకలేదు." - అంగన్ వాడీ సిబ్బంది 


చలో విజయవాడలో ఉద్రిక్తత 


అంగన్ వాడీల చలో విజయవాడ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి విజయవాడ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన అంగన్ వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు.  కొందరిని ముందస్తుగానే అరెస్ట్ చేసిన పోలీసులు,  మరికొందరి రోడ్లపై అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఏలూరులో అంగన్ వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పల్నాడులో సత్తెనపల్లిలో చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద అంగన్ వాడీలో నిరసన తెలిపారు.  అంగన్ వాడీలకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. వాళ్లను కూడా పోలీసులు అడ్డుకున్నారు. చాలా చోట్ల అంగన్ వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్న తమను ఈవిధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు అంగన్ వాడీలు.