Kodali Nani :  చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కొడాలి నాని మండిపడ్డారు.  గుడివాడలో ముస్లింలతో నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా  చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కామెంట్స్ చేశారు.  " అమిత్ షా ఏం చెప్పాడో. నువ్వు పాతిక తీసుకోని నాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్లు ఉన్నాడు. అప్పుడంటే.. అద్వానీ, వాజ్ పేయీ ఉండేవారు. చంద్రబాబు ఏం చెబితే ఆ కథలన్నీ వినేవాళ్లు. ఇప్పుడున్నది అమిత్ షా, మోదీ.. వాళ్లేం వింటారు? మేము 150 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం. నువ్వు పాతిక అసెంబ్లీ, 5 ఎంపీ పోటీ చేసుకో అని చంద్రబాబుతో చెప్పినట్లు ఉన్నారు. ఇందుకు అవును అంటే ఒక ప్రాబ్లమ్, కాదు అంటే మరొక ప్రాబ్లమ్. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి.. అవునని చెప్పలేడు, కాదని చెప్పలేడు. కాదని చెప్పి ముందుకెళితే భయంకరమైన దాడి ఉంటుంది. అవును అని చెబితే ఇది తోక పార్టీ అవుతుంది” అని విమర్శలు గుప్పించారు. 



చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు.  ”కుట్రలు, కుతంత్రాలు, చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు, పనికి రాని వాళ్లను ఎంతమందిని వేసుకొచ్చినా.. ఏమీ ఒరిగేది లేదు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. ప్రతి నిమిషం కూడా మీ కోసం తపిస్తున్నారు జగన్. ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారా.. జగన్ మోహన్ రెడ్డిని తప్పించి.. జగన్ నన్ను  చూసి భయపడతాడని చంద్రబాబు అంటారు. రా మరి చూసుకుందాం అంటే.. పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. మరో పక్క ఉత్త పుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు.  వీళ్లు సరిపోరు.. వదినమ్మ ముందు ఉండాలి. వీళ్లంతా ఉన్నారు అంటే.. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మను తెచ్చుకున్నాడు" అని విమర్శించారు. 


 పవన్ కల్యాణ్ పైన కొడాలి నాని మండిపడ్డారు.  ”పవన్ కల్యాణ్.. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడట. కాలేజీ బిల్డింగ్ ల మధ్య దిగిపోతాడట. ఆర్ అండ్ బీ, ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు నో చెప్పారు. రెక్క ఏదైనా తగిలి ప్రమాదం జరుగుతుంది, ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేము ఏదో చేశామని అంటారు. కాబట్టి, ఊరి బయట ఎక్కడైనా దిగు అని చెబితే.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. మంగళగిరిలోనే కూర్చున్నాడు. పవన్ కల్యాణ్ జనంలోకి వెళితే అడుగుతారు. మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. ఏయే సీట్లలో పోటీ చేస్తున్నాం అని కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. దానికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పలేడన్నారు. 


పవన్ సమాధానం చెప్పాలంటే ఢిల్లీ వాళ్లు చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికే పవన్ కల్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది. కారులో గంటన్నరలో వెళ్లొచ్చు. రేపు భీమవరంలో పోటీ చేసి గెలిచాక భీమవరం వెళ్లాలంటే హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే వెళ్తాను అంటారా? కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని కొడాలి నాని సలహా ఇచ్చారు.