Key decisions taken in AP Cabinet meeting:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్య‌క్ష‌త‌న అమరావతి సచివాలయంలో మూడు గంటల సేపు  మంత్రి వర్గ సమావేశం జరిగింది.  24 అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలు, అభివృద్ది పనులపై నిర్ణయాలు తీసుకున్నారు.  మే రెండో తేదీన అమరావతికి మోదీ వస్తారని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 

అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్  

సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అమ‌రావ‌తి నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన నిధులు స‌మీక‌రించుకునేందుకు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌కు కేబినెట్ అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే  నూత‌న అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాల టెండ‌ర్ల‌కు అంగీకారం తెలిపింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన కంపెనీకి పనులు అప్పగించేందుకు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి రూ.786 కోట్లు, ఎల్‌ 1 బిడ్డర్‌లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందజేసేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 

పలు కీలక అంశాలపై చర్చలు

క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజాన్ని అభివృద్ధి చేయడం క్లైమేట్ యాక్షన్ ప్లాన్, డేటా డ్రైవన్ ప్లానింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం స్టేట్ క్లైమేట్ సెంటర్‌ను మూడు నగరాల్లో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిం పాలెంలో వంద బెడ్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి స్టాఫ్ క్వార్టర్స్‌కు భూమి కేటాయింపులకు కేబినెట్‌లో  నిర్ణయం తీసుకున్నారు. . ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 30 ఎకరాలు భూమిని ఉచితంగా కేటాయించారు.  ఐదో ఎస్ఐపీబీ సమావేశంలో  రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదించారు. వాటికి  కూడా కేబినెట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా  ఆర్డినెన్స్ కు ఆమోదం 

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలిపింది.  జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది.    కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు,  నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు   భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.           

మంత్రులపై అసహనం   

కేబినెట్ భేటీ ముగిసిన తరవాత మంత్రులతో  చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ ఫేక్ న్యూస్ తో మత విద్వేషాలు పెంచాలనుకుంటోందని.. ఈ విషయంలో మంత్రులు చురుకుగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని ఎన్ని  సార్లు చెప్పినా మంత్రుల్లో స్పందన ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.