Kesineni :   విజయవాడ ఎంపీ కేశినేని నాని అవసరం అయితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా ఏ పిట్టల దొరకు తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్టు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని  సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందా? తాను ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని నాని తేల్చి చెప్పారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకన్నా తనకు భయం లేదన్నారు. తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని కేశినేని నాని చెప్పారు. తాను చేసిననన్ని పనులు దేశంలో ఏ ఎంపీ కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు.ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని నాని వ్యాఖ్యానించారు. 


వైసీపీలోకి కేశినేని నాని వస్తానంటే స్వాగతిస్తామని వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి మీడియాతో వ్యాఖ్యలు చేసిన రోజే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వైసీపీ నేతలు కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో రెండు ఫ్లాట్‌ ఫామ్స్ ఉన్నాయని..అది జగన్, చంద్రబాబు అని కేశినేని నాని చెబుతున్నారు. ఏదైనా వైరం ఉంటే వారి మధ్యే ఉన్నాయని..  నేతల మధ్య లేవన్నారు. అభివృద్ధి పనుల కోసం ఇతర పార్టీల నేతల్ని కలిస్తే తప్పు లేదన్నారు. ఇటీవల కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 
 
2019 ఎన్నికల తర్వాత అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి. తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించుకుని.. తానే గెలిపించుకుంటానని ప్రచారం చేశారు. అయితే ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.                              


 విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇతర టీడీపీ నేతలతో కూడ నానికి మధ్య గ్యాప్ పెరిగింది..ఈ నేప‌థ్యంలో నానీ సోద‌రుడు చిన్నా యాక్టీవ్ అయ్యారు.. టిడిపి కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గాపాల్గొంటూ అధిష్టానానికి ద‌గ్గ‌ర‌య్యారు.. విజ‌య‌వాడ లోక్ స‌భ సీటును చిన్నా ఆశిస్తున్నారు. సోదరుడితో కేశినేని నానికి సంబంధాలు చెడిపోయాయి. గతంలో ఎన్నికల్లో విజయం కోసం నాని కోసం చిన్ని పని చేసినప్పటికీ.. తర్వాత సొంతంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి కాలంలో  టిక్కెట్ల కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి ఎంపీగా కేశినేనిని పరిగణనలోకి తీసుకోవడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేశినేని నాని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు.