Posani Krishna Murali: తెలుగు సినిమాలను ఏపీలోనూ చిత్రీకరించినా ఎలాంటి శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కి మరీ అడుగుతానని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. ఏపీలో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చని చెప్పారని.. అలా అని అక్కడ షూటింగ్ చేస్తే తెలంగాణ స్థలాలిచ్చాం కదా, అక్కడికి ఎందుకు వెళ్లారని అని అడుగుతున్నారని మంగళవారం రోజు జరిగిన వెలగపూడి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలోనే ఉంటే ఏపీలో స్థలాలు ఇస్తామన్నా ఎందుకు ఉండరని అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్, ఫిటింగ్ అయిపోందంటూ కామెంట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్ట పడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ ను మనసారా అడిగితే కచ్చితంగా ఆయన సాయం చేస్తారని పోసాని కృష్ణ మురళీ వివరించారు. 


కేసీఆర్.. కేటీఆర్.. రేవంత్ రెడ్డిలే కాబోయే ముఖ్యమంత్రులు...


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. భవిష్యత్తులో కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు సీఎంలు అవుతారని అన్నారు. ఇలా వ్యవస్థ జరిగిపోతుందని.. అయితే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ తో ముడిపడి ఉందన్నారు. ఆయనకు చిత్ర పరిశ్రమ బాధలు అన్నీ చెప్పి ఒప్పిస్తే ఏపీలోనూ సినిమాలు తీసుకునేలా సాయం చేస్తారని స్పష్టం చేశారు. అదే జీవో పెడితే చించి బయట పడేసి.. మీకు ఇష్టం లేకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోండని అంటారని.. అదే జరిగితే మనం ఏ చేస్తామంటూ ప్రశ్నించారు. అందుకే మెళ్లిగా, బతిమాలుతూ మాట్లాడుకొని పని చేయించుకోవడం మంచిదని చెప్పారు. 


పద్యనాటక పోటీలకు నోటిఫికేషన్ - అన్ని రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు


అలాగే రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా కళాకారుల సంఖ్య తగ్గిపోతుందని.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత తక్కువయ్యారని అన్నారు. ఈ క్రమంలోనే పద్య నాటకాలకు ఊపిరి పోయాలని తాము నిర్ణయించుకున్నట్లు పోసాని కృష్ణ మురళీ వెల్లడించారు. పద్య నాటక పోటీలకు బుధవారం రోజు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు, యువత నాటికలకు సంబంధించి ఐదు విభాగాల్లో 73 అవార్డులు ఇస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో ఏపీఎఫ్డీసీ వెబ్ సైట్ ద్వారా .. అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే దరఖాస్తులను ఉప సంహరించుకోవడానికి వారం రోజులు గడువు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. నాటక సమాజాలు ఎక్కుడ తమ కళారూపాలు పదర్శించాలని అనుకున్నాయో.. అక్కడికే జ్యూరీ వెళ్లి చూస్తుందని తెలిపారు. అయితే ప్రాథమిక పరిశీలనలో ఎంపిక అయిన సమాజాలు వారం రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు. విజేతలకు ఏడో రోజు అవార్డులను అందజేస్తామని ఏపీఎఫ్టీవీడీసీ ఎండీ టి. విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.