Dwarampudi On Lokesh Padayatra :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాట్లాడిన ఆయన... లోకేశ్ పాదయాత్ర ప్రజల కోసం కాదని, కొవ్వు పెరిగిపోయి ఒళ్లు కరిగించుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇవాళ  ప్రజలకు ఏ కష్టం ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం 97%  అమలు చేసిందన్నారు. ఆనాడు చంద్రబాబు పాలనలో కరవు పై వైఎస్ఆర్, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైఎస్ జగన్ పాదయాత్రలు చేశారని తెలిపారు. 


కొవ్వు కరిగించుకునేందుకే పాదయాత్ర 


"లోకేశ్ పాదయాత్ర ప్రజల కోసం కాదు కొవ్వు కరిగించుకునేందుకు చేస్తున్నారు. నేను వైఎస్ఆర్, సీఎం జగన్, చంద్రబాబు, షర్మిల పాదయాత్ర చూశాను. అందరూ కూడా సన్నగా ఉంటారు. లోకేశ్ పాదయాత్ర కేవలం స్లిమ్ అయ్యేందుకే. ఈ రోజు ప్రజలకు ఏ కష్టం ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు జగన్ పాదయాత్ర చేశారంటే... చంద్రబాబు హామీలు నెరవేర్చలేదనే కారణం ఉంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టో ఇచ్చినా 97 శాతం హామీలు నెరవేర్చాం. మేం ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ చేశాం. పాదయాత్ర ఒక ఫ్యాషన్ అయిపోయింది. లోకేశ్ చేసే పాదయాత్ర కేవలం సీటు తగ్గించుకోవడం కోసమే. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 1988 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పవన్ కల్యాణ్ గురించి అవసరం నాకు లేదు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో విపరీతమైన కరవు ఉంది. ప్రజలు వైఎస్ఆర్ ను నమ్మి గెలిపించారు. జగన్ పాదయాత్ర కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చేశారు. ఆయన్ని ప్రజలు గెలిపించారు. నా వ్యక్తి గత అభిప్రాయం ప్రకారం లోకేశ్ కేవలం కొవ్వు తగ్గించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు."- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి


టీడీపీతో తిరిగిన వాళ్లు ప్రభుత్వ పథకాలు వదిలేసుకోండి 


"కిరాయి వాళ్లను పెట్టుకుని కొందరు కాకినాడ పట్టణ వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గంలో పింఛన్ రావడంలేదని ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. ట్యాక్స్ కట్టో, అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉండో, కరెంట్ బిల్లు ఎక్కువ, ఫోర్ వీల్స్ ఇతర కారణాల వల్ల కొందరు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేదు. అంతే తప్ప అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. ఇదేం కర్మ అని టీడీపీ నేతలు కాకినాడలో తిరుగుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఫెయిల్ అయింది. టీడీపీ నేతలు కిరాయి వాళ్లతో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలతో తిరిగి వాళ్లు ప్రభుత్వ పథకాలు వదిలేసుకోండి. నేను గ్రావెల్ మాఫియా చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్ వద్ద రాద్ధాంతం చేశారు. అసలు పెద్దాపురం నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ చేసిందే చినరాజప్ప. టీడీపీ నేతలంటే అబద్ధాలు, మోసాలు. మీ నాయకుడే పెద్ద మోసగాడు." - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి