Janasena News: ప్రజలతో శెభాష్ అనిపించుకునేలా పాలన చేద్దామని జనసేన అధినేత పవన్  కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు. పార్టీకి ప్రజలు ఇచ్చిన ఈ విజయం ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాదని.. అభివృద్ధి, సంక్షేమం కోసం అని పిలుపు ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాల సమస్యలను పరిష్కరిద్దామని పిలుపు ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని.. వ్యక్తిగత విమర్శలు పూర్తిగా నిరోధించాలని అన్నారు. జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.


ప్రజలు జనసేన పార్టీని నమ్మి పెద్ద బాధ్యతను ఇచ్చారు. దాన్ని అందరూ సక్రమంగా నిర్వర్తించాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. నాతో సహా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా దాన్ని బాధ్యతగా తీసుకుందాం. భారతదేశంలో ఎంతో మంది రాజకీయ పార్టీలను దశాబ్దం పాటు అధికారంలో లేకుండా నడిపిన దాఖలాలు లేవు. జనసేన పార్టీ ప్రయాణం ప్రజల ప్రేమ, అభిమానం, నమ్మకం, అనే ఇంధనంతోనే నడిచింది.


నేను ఢిల్లీ వెళ్లినప్పుడు చాలా మంది జాతీయ స్థాయి నాయకులు ఇంతకాలం పాటు పార్టీని ఏ అధికారం లేకుండా ఎలా నడిపారని అడుగుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు సాధించిన విజయం. ఈ స్ఫూర్తిని వారి నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునేలా ఇక ముందు కూడా మన ప్రయాణం ఉండాలి’’


జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా మొదట నియోజకవర్గంలో కీలకమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులు పడుతున్న విషయాలను గుర్తించాలి. ఏవి మొదటి ప్రాధాన్యాలో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ పనులు కేంద్రం పరిధిలో ఉంటే వాటిని అక్కడి నుంచి పూర్తయ్యేలా చొరవ చూపుదాం.’’ అని పవన్ కల్యాన్ జనసేన ఎమ్మెల్యేలకు సూచించారు.