AP Rajya Sabha Elections 2026: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ తన అభ్యర్థిని అధికారికంగా బరిలోకి దింపింది. వ్యాపారవేత్తగా, సామాజిక సేవా రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన లింగమనేని రమేష్ను జనసేన పార్టీ తన రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఈ సీటు దక్కడం, దానికి పారిశ్రామికవేత్త అయిన లింగమనేనిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముందే శనివారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లింగమనేని రమేష్ అధికారిక బి-ఫామ్' అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం లింగమనేని రమేష్ తన గళాన్ని బలంగా వినిపిస్తారనే నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
శాసనసభలో నామినేషన్ సమర్పణ కార్యక్రమం కూటమి నేతల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, బీజేపీ ఎమ్మెల్యే ఎన్. ఈశ్వర రావు తదితరులు నేరుగా రిటర్నింగ్ అధికారి ఛాంబర్కు వచ్చి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమికి చెందిన ప్రముఖ నేతలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద బాబు, ఎన్. ఈశ్వర రావు ప్రతిపాదన సంతకాలు చేశారు.
నామినేషన్ దాఖలు అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో లింగమనేని రమేష్కు కూటమి ప్రజాప్రతినిధుల నుండి అభినందనలు లభించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి సంఖ్యాబలంతో ఉండటంతో లింగమనేని ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పారిశ్రామికవేత్తగా, సామాజికవేత్తగా ఉన్న లింగమనేని రమేష్కు రాజకీయంగా ఇంత పెద్ద అవకాశం దక్కడం వెనుక పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో సుపరిచితుడైన లింగమనేని, రాబోయే రోజుల్లో ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, పారిశ్రామికాభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తారని జనసేన శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తనపై నమ్మకంతో ఈ అరుదైన అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు లింగమనేనిరమేష్. అలాగే తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. జనసేన తరఫున ఆయన రాజ్యసభకు వెళ్లడం పార్టీ శ్రేణులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తోందని నాగబాబుపేర్కొన్నారు. రమేష్ గారు అత్యంత సమర్థుడని, అన్ని విధాలా సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం పట్ల పార్టీ కేడర్ అంతా పూర్తి సంతోషంతో ఉందని నాగబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు.
