CM Jagan Delhi Tour  :   ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్  ముగిసింది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.  ప్రధానమంత్రితో జరిగిన సమవేశాలు రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి. 


పోలవరం నిధులు విడుదల చేయాలని కోరిన సీఎం  జగన్ 


పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని  ముఖ్యమంత్రి కోరారు.   పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరినట్లుగా సీఎంవో తెలిపింది. 


తెలంగాణ నుంచి కరెంట్ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి   


2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని   సీఎం కోరారు.   రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాథి అవకాశాలు ఏర్పాడతాయని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం... కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 


బోగాపురం ఎయిర్ పోర్టు పనులపై విజ్ఞప్తి 


విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.  విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా  చూడాలన్నారు. కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరారు.  ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. అలాగే  విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనే సీఎం జగన్  పార్లమెంట్ లో సమావేశం అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు.  


మీడియాతో మాట్లాడేందుకు జగన్ నిరాకరణ


పార్లమెంట్ లోకి వెెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు మీడియా ప్రతినిధులు మాట్లాడమని కోరినా సీఎం జగన్ స్పందించలేదు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్పటికే పీవీకి భారతరత్న ప్రకటించారు. దీనిపై స్పందించాలని కోరినా సీఎం పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పి వెళ్లిపోయారు.