YS Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ.. హైదరాబాద్‌ లోని ఆఫీస్ కు విచారణకు రావాలని కోరింది. దీంతో శనివారం ఆయన విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యాస్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. ఆ లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పారని ప్రశ్నించినట్లు సమాచారం. శనివారం సాయంత్రం 4 గంటలకు సీబీఐ ఆఫీస్ కు వచ్చిన రాజశేఖర్‌రెడ్డి.. విచారణ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడంలేదని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్న తరుణంలో... రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం ప్రాధాన్యత సంచరించుకుంది. వివేకా హత్య కేసులో  ఇటీవల అరెస్టైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుంది.  


వివేకా రెండో భార్య సీబీఐ స్టేట్మెంట్ లో కీలక విషయాలు 


వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన రిపోర్టు వెలుగు చూసింది. సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డితో  2010 లో తనకు వివాహం అయ్యిందని షేక్ షమీమ్ తెలిపారు. అయితే   2011లో మరోసారి వివాహం చేసుకున్నామన్నారు. రెండు సార్లు వివాహం జరిగినట్లుగా షమీమ్ తెలిపారు.  2015లో తమకు షహన్ షా పుట్టారని సీబీఐకి తెలిపింది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో  ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు.  వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. 


సునీతారెడ్డి హెచ్చరించారు 


వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డి కన్నేశారని షమీర్ ఆరోపించారు.  తమ కొడుకు షహన్ షా  పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని..  హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ వెల్లడించారు. సీబీఐకి షేక్ షమీమ్ మూడు పేజీల స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. తనకు వివేకా గారికి పుట్టిన సంతానమే షేక్  షహన్ షా అని..  తాను డీఎన్‌ఏ టెస్ట్  కు సిద్ధమేనని షమీమ్ తెలిపారు.  మాకు సంతానం కలగలేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న దస్తగిరి  ..  నిరూపిస్తే నేను మీరు చెప్పినట్లు చేస్తానని పేర్కొన్నారు.   ఒకవేళ నిరూపించలేకపోతే వెంటనే ఈ హత్య చేసిన నీవు ఉరిశిక్షకు సిద్దమా అని దస్తగిరికి సవాల్ చేశారు.  తన లాయర్ ద్వారా మీడియాకు ఈ స్టేట్‌మెంట్‌ను  చేరేలా చేశారు.  దీంతో ఈ స్టేట్ మెంట్ అంశం సంచలనంగా మారింది.