AP High Court: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనపై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పిటిషనర్ శ్రీనివాసరావు నాలుగేళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నాడని అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.


గతంలో విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల కిందట విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు విచారణ గతంలో విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరిగేది. దాని కంటే ముందు విజయవాడలో జరిగేది. ఆ సమయంలో సీఎం కోర్టుకు హాజరు కావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ కేసు ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నా నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు. 


ఈ కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే తేల్చిన ఎన్ఐఏ.. చార్జిషీటు  దాఖలు చేసింది. జగన్ NOC అయినా ఇవ్వాలని లేదా, వాదనలైనా వచ్చి వినిపించాలని.. నిందితుడి తరపు న్యాయవాది కోరారు. కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని..  రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారన్నని ఆయన అసహనం వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. 


సుప్రీంకోర్టు జడ్జికి లేఖ
ఐదేళ్లుగా జైల్లో ఉన్నా ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదని..  విముక్తి కల్పించాలంటూ జనపల్లి శ్రీనివాసరావు గతంలో సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేఖరాశారు.  కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించాన, అయినా స్పందన లేకపోవడంతో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానని ఆయన వాపోయారు.  శ్రీనివాసరావు  తల్లి సావిత్రి.. గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇదే విషయంపై లేఖ రాశారు.  
  
చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ 
వేగంగా విచారణ జరిగిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22 పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు పేర్కొంది.


ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టం చేసింది. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్‌లో స్పష్టం చేసింది.


ఫైబర్‌ నెట్‌ కేసు.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ పిటిషన్‌
ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ ప్రతిపాదించింది. ఈ మేరకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.