MLC Group Photo: ఆంధ్రప్రదేశ్  శాసనమండలి సభ్యులకు గ్రూప్ ఫోటో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశాలతో పలువురు గ్రాడ్యూయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. ఈ కారణంగా గ్రూప్ ఫోటో కార్యక్మరం నిర్వహించారు.   మఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మండలి సభ్యుల ఫోటోలు దిగే సందర్భంలో పలు ఆసక్తికర చర్చలు జరిగాయి.                  

సాధారణంగా అసెంబ్లీ జరిగేటప్పుడు పెద్దగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. లాబీల్లో కలిసినా సరదా ముచ్చట్లు చెప్పుకోవడం కష్టం. కానీ అసెంబ్లీ భవనాల లాన్ లో జరిగిన  ఫోటో షూట్ కార్యక్రమంలో మాత్రం  ఎమ్మెల్సీలు సందడిగా మాట్లాడుకున్నారు.  

వైసీపీ ఎమ్మెల్సీతో ఫోటో దిగడం అదృష్టం అన్న చంద్రబాబు                    

శాసనమండలి సభ్యులతో ఫోటో దిగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు కూ డా వచ్చారు. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ముందు వరుసలోనే ప్రోటోకాల్ ప్రకారం కూర్చున్నారు. అయితే మోషన్ రాజు.. జకియాఖానం ఇద్దరూ వైసీపీకి చెందిన వారే దీంతో జకియా ఖానం చంద్రబాబు సీటు పక్కన కూర్చున్నారు. మీతో ఫోటో దిగడం తన అదృష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆశ్చర్యపోయారు. ఎందుకటే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదు. ఎమ్మెల్సీలు మాత్రమే వస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే .. వారు అయినా వచ్చారని అదే అదృష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుతో ప్రత్యేకంగా ఫోటో దిగిన లక్ష్మణరావు          

మరోవైపు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగాలని కోరారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా చేతిలో ఓడిపోయిన లక్ష్మణరావు అభ్యర్థనతో  వెంటనే ఫొటోకు అవకాశం ఇచ్చారు.

నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు 

మరో వైపు నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు చేశారు.  మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వడం లేదని నారా లోకేష్ చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పారు.  దీనికి సీఎం స్పందిస్తూ, "పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలి" అని లోకేష్‌కు సలహా ఇచ్చారు. 

బొత్స సత్యనారాయణ గందరగోళం 

ఫొటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అని మంత్రి బొత్స సత్యనారాయణ చీఫ్ విప్ అనూరాధను  ప్రశ్నించారు. మండలి ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. అయితే, బొత్స పొరపాటున  ఆయనకు కేటాయించిన కుర్చీలో కాకుండా ఖాళీగా ఉందని వేరే కుర్చీలో కూర్చున్నారు.  దీంతో డిప్యూటీ సీఎం సీటుకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన మంత్రి నారా లోకేష్, బొత్సను లేపకుండా మరో కుర్చీ ఏర్పాటు చేయించారు.

ఈ ఘటనలన్నీ ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్‌ను ఆసక్తికరంగా మార్చాయి. రాజకీయ నాయకుల మధ్య సరదా సంభాషణలు, చిన్నపాటి గందరగోళాలు  చోటుచేసుకున్నాయి.