Kiran In Delhi :  భారతీయ జనతా పార్టీలో చేరిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన శుక్రవారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. శనివారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా  40 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపైనాచర్చించారు.  మరో సీనియర్ నేత బీఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.               


కిరణ్ కుమార్ రెడ్డి అనుభవాన్ని ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఇరవై నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి  ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఓ ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నట్లగా చెబుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ఆయన నేరుగా ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు కానీ.. ఆయన ఆలోచనలను ఎన్నికల్లో వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                     


మరో వైపు ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డిని పంపకపోచ్చని.. ఆయనను పార్టీలో చేర్చుకున్న వ్యూహం జాతీయ రాజకీయాలని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఆయనకో పదవి ఇస్తుందని..  జాతీయంగా పార్టీ కోసం పని చేస్తారని.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం  చేసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసినందున తెలంగాణలో రాజకీయాలపైనా ఆయనకు అవగాహన ఉంటుంది. సమైక్యాంధ్ర పార్టీ పెట్టినందన ఆయన జోక్యం నేరుగా తెలంగాణలో ఉండకపోవచ్చు కానీ.. ఢిల్లీలో ఉంటూ తెలంగాణ పై రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కిరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా పని చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.                               


కిరణ్ కుమార్ రెడ్డి చేరిక కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఏపీ బీజేపీ నేతలు లేరు. సోము వీర్రాజు సహా కీలక నేతలంతా ఏపీలోనే ఉన్నారు. అయితే వారెవరూ కిరణ్ రెడ్డి చేరికపై వ్యతిరేకత వ్యక్తం  చేయడంలేదు. అందరూ స్వాగతించారు. కలిసి పని చేస్తామన్నారు. అలాంటప్పుడు.. బీజేపీ నేతలంతా కిరణ్ రెడ్డి చేరిక కార్యక్రమలో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ రాజకీయాల కోణంలోనే హైకమాండ్ చేర్చుకుందని అందుకే చేరిక విషయంలో రాష్ట్ర నేతలతో పెద్దగా సంప్రదింపులు జరపలేదని.. సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.