AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
AP Rains | వాయుగుండం శ్రీలంక సమీపంలో తీరం దాటింది. అయితే ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. మరోవైపు తెలంగాణలో చలిగాలు తీవ్రత తగ్గిందని వాతావరణశాఖ తెలిపింది.

Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది. ఇది ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ముందుగా శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారి, సాయంత్రం సమయంలో శ్రీలంకలోని ముల్లయిట్టివు సమీపంలో తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. తీరం దాటిన సమయంలో ఇది ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, చెన్నైకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది. ఇది ఆదివారం (జనవరి 11) ఉదయానికి మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈ వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం చల్లగా మారుతంది. అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నాడు ఈ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముంద్రంలో చేపల వేటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలో వర్షాలు
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ పేర్కొంది.
వాయుగుండం తీరం దాటిన తర్వాత సాధారణంగా దాని తీవ్రత తగ్గుతుంది. అయితే భూభాగంపై తేమ ఉన్నంతవరకు వర్షాలు కొనసాగుతాయి. వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అలజడిగా ఉంటుంది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ, దీని ప్రభావం వల్ల సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆదివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి క్రమంగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
తెలంగాణ ప్రజలకు చలి నుంచి ఉపశమనం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణలో వాతావరణం మారుతోంది. గత ఆరు రోజులుగా రాష్ట్రాన్ని వణికించిన శీతల గాలులు ముగిశాయి. ప్రస్తుతం తమిళనాడు తీరానికి సమీపంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో మధ్య స్థాయి ఆల్టోక్యుము్యలస్ (Altocumulus), స్ట్రాటోక్యుము్యలస్ (Stratocumulus) మేఘాలు తెలంగాణ వైపునకు వస్తున్నాయి.
ఈ మేఘాల కారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా (25-26°C) నమోదవుతాయి. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తీవ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. రాబోయే సంక్రాంతి పండుగ సమయానికి పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 29-31°C వరకు చేరే అవకాశం ఉంది. శీతాకాల పరిస్థితులు కొనసాగుతాయి కానీ, రాబోయే 7 నుండి 10 రోజుల వరకు తీవ్రమైన శీతల గాలుల ప్రభావం ఉండే అవకాశం లేదు.






















