CM Jagan Kovvur Tour: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు. 



మహిళల భద్రతకు పెద్దపీట 


ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు సీఎం జగన్  పెద్దపీట వేశారని ఇటీవల తానేటి వనిత అన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. దాదాపు ఒక కోటి 40 లక్షలకు పైగా ప్రజలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. ఆపద సమయాల్లో ఉన్న మహిళలు దిశ యాప్ ను ఉపయోగించి రక్షణ పొందుతున్నారని స్పష్టంచేశారు. లైంగిక దాడి బాధితులకు త్వరితగతిన విచారణ నిర్వహించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 


రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 


ఏపీ పోలీస్ శాఖ పారదర్శకంగా, పూర్తి స్వేచ్ఛ గా పనిచేసే అవకాశాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి  కల్పించారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్ట ప్రకారం శిక్షించాలని సీఎం జగన్  పోలీసులకు సూచించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది కాబట్టే వైస్సార్సీపీ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ పదేపదే అసత్య ఆరోపణలు చేయడం తగదని మంత్రి తానేటి వనిత  మండిపడ్డారు. అమరావతి పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఆరోపించారు.  పాదయాత్ర చేస్తున్న వారు పోలీసులను రెచ్చగొట్టినప్పటికీ సమన్వయంతో సహకరించారని తెలిపారు. పోలీసుల భద్రత లేకుంటే జిల్లాల్లో పాదయాత్ర ఎలా చేశారని ప్రశించారు. రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర ముసుగులో రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు. అలాగే గంజాయిని నిలువరించడంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతుంటే ఏపీలోని 11,550 ఎకరాల గంజాయి అంటే దాదాపు 45 శాతం పంటను నాశనం చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి పౌడర్ ను పట్టుకుని ధ్వంసం చేసినట్లు హోంమంత్రి తెలిపారు.  గంజాయి పంట సాగు చేయకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 11,100 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్ధాలపై యువతకు అవగాహన కార్యక్రమాల నిర్వహించినట్లు తానేటి వనిత పేర్కొన్నారు.