AP Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారని.. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారని అన్నారు. మచిలీపట్నంలో స్థానిక వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టూకు మద్దతుగా వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా జగన్ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై కూడా జగన్ స్పందించారు. ఈ చట్టం ద్వారా ఎవరి భూములపై వారికే హక్కులు కల్పిస్తామని.. ఇంత వరకూ వేల ఎకరాలు క్రమబద్దీకరించామని.. ఎక్కడా పొరపాటు జరగలేదని అన్నారు. భూ వివాదాలు పెరిగి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని జగన్ అన్నారు. భూ వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని.. సంస్కరణ తీసుకురావాలనేదే తన ఆలోచన అని సీఎం జగన్‌ తెలిపారు.


ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ తో ఫిర్యాదు చేయించి అన్నీ అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు. లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని అన్నారు.


‘‘బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమే. చంద్రబాబును నమ్మితే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఆయనవి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే. ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు. 2 లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడు. ఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని అప్పుడే తేలింది. తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌ అయింది’’ అని సీఎం జగన్ మాట్లాడారు.






‘‘ఈ నెల పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అడ్డుకున్న పెత్తందారుడు చంద్రబాబు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియా అంతా కలిసి ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి.. బటన్ నొక్కిన పథకాలకు విడుదల చేయాల్సిన నిధులు కూడా ఆపుతున్నారు’’ అని జగన్ ఆరోపించారు.



వైఎస్ఆర్ సీపీ పోస్ట్
BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోదీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు. APలో CAA/NRC ఉండకూడదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం అని చెప్పగలగాలి. ఇవి ప్రకటించక పోతే మీరు కపట నాటక సూత్రధారి అని, న్యాయంలేనివారు అని నిర్ధారణ అవుతుంది!’’ అని పోస్ట్ చేశారు.