NTR Bharosa Pension Distribution June: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మరియు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఉదంతంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తాం, కత్తులు, కటార్లు తీసుకొస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు.. గుర్తు పెట్టుకోండి ఇక్కడున్నది సీబీఎన్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది సామాన్య ప్రభుత్వం కాదని, కేంద్ర, రాష్ట్రాల్లో తిరుగులేని బలమున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని గుర్తు చేశారు. ఓ వైపు తాను , మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇంకోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఎవరి ఆటలు సాగనివ్వబోమని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని ఆయన ధ్వజమెత్తారు.
నంద్యాల విగ్రహంపై దాడి.. సాక్షిపై మండిపాటు
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహంపై జరిగిన దాడి ఉదంతాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహంపై దాడి చేసింది సాక్షాత్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తేనని, దానికి ఆ పార్టీ స్థానిక నేతే సపోర్ట్ చేశాడని క్షేత్రస్థాయి ఆధారాలతో సహా బయటపడిందన్నారు. మరి ఈ నిజం సాక్షి పేపర్లో ఎందుకు వార్తగా రాలేదు అని చంద్రబాబు నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం, కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం కోసమే స్వయంగా ఈ డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. నీ సొంత నాన్న విగ్రహాన్ని నీ పార్టీ వాళ్లే ధ్వంసం చేసినా పేపర్లో వేయవు.. ఎందుకంటే ఆ పని వెనుక ఉన్నది నువ్వే, ఆ దాడిని నువ్వే చేయించావు కాబట్టి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అధికార బలం.. అరాచకాలకు తావులేదు
గత ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడారని, అయినా ప్రతిపక్ష నేతల్లో మార్పు రాకపోవడం విచారకరమని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కల్పిత అల్లర్లను సృష్టించి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని పిలుపునిచ్చారు.
నెల ఒకటో తేదీనే రూ. 2,721 కోట్ల పెన్షన్లు
సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చంద్రబాబు వివరించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రతి నెల ఒకటో తేదీనే రూ. 2,721 కోట్ల నిధులను సిద్ధం చేసి నిరుపేదలకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. తుని పర్యటనలో భాగంగా వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్ అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా, లబ్ధిదారుల దరికే చేర్చేలా తమ పరిపాలన సాగుతుందని సీఎం హామీ ఇచ్చారు. రాజకీయ కక్షసాధింపులకు తావులేకుండా, రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని నమ్మకం వ్యక్తం చేశారు.
