CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
One Family One Entrepreneur policy AP: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. పలువురు వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం అయ్యారు. పెట్టుబడులకు మోదీ ఎకోసిస్టం భరోసా ఉంటుందన్నారు.

Singapore venture capitalists invest in AP startups: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విస్తృతస్థాయి భేటీలు నిర్వహించారు. సింగపూర్లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే, స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు, ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. నవ్యాంధ్ర గ్లోబల్ పార్ట్నర్గా మారడానికి సింగపూర్ కంపెనీలు ముందుకు రావాలని కోరుతూ.. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా
భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక ఆలోచనల కారణంగా భారతదేశంలో బ్యూరోక్రసీ జాప్యం లేకుండా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కొనియాడారు. ఒకప్పుడు ‘హిందూ గ్రోత్ రేట్’ చాలా తక్కువగా ఉండేదని హేళన చేసిన వారే, ఇప్పుడు భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఏపీలో షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్లో ఎంఆర్వో కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ.. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఏపీ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం కుదరాలని ఆయన ఆకాంక్షించారు.
వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్
సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం ఒక కీలక నినాదాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి తాము వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ అనే వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది అయిన భూ సమీకరణ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలకు తాము ఎంత వేగంగా భూములు, అనుమతులు ఇచ్చామో వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహించడానికి వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు పలు సమావేశాలు నిర్వహించారు. వారికి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్తో భేటీ… pic.twitter.com/nxUeYlZIk2
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 15, 2026
రైతులకు మేలు.. హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యం లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారని చంద్రబాబు అంతర్జాతీయ ప్రతినిధులకు తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన హార్టికల్చర్ పంట ఉత్పత్తులను ఏపీ నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, ఆహార రంగంలో ట్రేసబిలిటీ విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్వేర్ తయారీ రంగానికి ఏపీ కేరాఫ్ అడ్రస్గా మారుతోందని, సింగపూర్ టెక్ అవసరాలను తీర్చగల నిపుణులైన యువశక్తి రాష్ట్రంలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
యూఎన్ హాబిటాట్తో కీలక ఒప్పందం
పర్యటనలో మరో కీలక మైలురాయిగా.. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్బాక్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఉచితంగా భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. తీరప్రాంత నగరాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించే రైజప్ కార్యక్రమాన్ని, మురికివాడల అభివృద్ధి కోసం పార్టిసిపేటరీ స్లమ్ అప్గ్రేడింగ్ ప్రోగ్రామ్ ను ఏపీలో అమలు చేయాలని ప్రతిపాదించారు. 2028 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి ఒక పక్కా టైమ్లైన్తో కూడిన ఎంవోయూ ఖరారు చేయాలని, మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ వాతావరణ నిధులను సమీకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















