Chandrababu Nidadavolu: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
women reservations: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో నిడదవోలులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పని చంద్రబాబు హెచ్చరించారు.

CM Chandrababu Naidu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ,ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా శనివారం ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన జ్వాల ఈ నిడదవోలు నుంచే మొదలైందని ప్రకటించారు.
చారిత్రక వారసత్వం.. మహిళా శక్తి
మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలోనే దివంగత నేత నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చి వారిని రాజకీయంగా ఎదిగేలా చేశారని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఆడబిడ్డలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఇంటిని నిలబెడుతున్నారని వారి శక్తిని కొనియాడారు.
కాంగ్రెస్ అడ్డంకులు.. ఇండియా కూటమి ద్వంద్వ నీతి
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పిస్తే, కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు కావాలనే అడ్డుతగిలాయని ఆరోపించారు. మహిళలకు మేలు చేసే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి వారికున్న అభ్యంతరం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే ఈ పాటికే చారిత్రక చట్టం అమల్లోకి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ సాకుతో రాజకీయం
దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా నష్టం జరుగుతుందనే వంకతో మహిళా బిల్లును అడ్డుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇచ్చారని, దక్షిణాది ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అన్నీ తెలిసినా రాజకీయ లబ్ధి కోసం బిల్లును అడ్డుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీనిని అడ్డుకోవడం క్షమించరాని నేరం.#NariShaktiVandan#SthreeShakti#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/XtpVKqpVc2
— Telugu Desam Party (@JaiTDP) April 18, 2026
నిడదవోలు నుంచే పోరాటం మొదలు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ రోజు నిడదవోలులో జరిగిన నిరసన ర్యాలీ కేవలం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా మహిళలందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. నిడదవోలు పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















