Chandrababu comments on Amaravati: ఎన్నికల ముందు మూడు ముక్కలాట ఆడిన గొడ్డలి పార్టీ.. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతోంది. అసలు ఆ మావిగన్ అంటే ఏంటో ఎవరికైనా అర్థమైందా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లె వేదికగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సరికొత్తగా రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక గ్రామీణ ఉపాధి పథకం వీబీజీ రామ్జీ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాతో జరుగుతాయన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
మన రాజధాని అమరావతి దేవతల రాజధాని అని, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత పాలకులు రాజధానిని ధ్వంసం చేయాలని చూసినా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ప్రస్తుతం అమరావతిలో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. జగన్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఇప్పుడు ప్రజలను మళ్లీ భ్రమల్లో ముంచాలని చూస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకత్వం నిస్వార్థంగా పనిచేస్తోందని, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే తమ లక్ష్యమని, ఈ ప్రయాణం ఇక అన్స్టాపబుల్ అని చంద్రబాబు ప్రకటించారు.
గతంలో ఉపాధి హామీ పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేస్తూ.. మెరుగైన సవరణలతో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్జీ పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం చారిత్రాత్మకమని సీఎం అన్నారు. కేంద్రం రూ. 7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000 కోట్ల వాటాతో మొత్తం రూ. 11,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో 100 రోజులుగా ఉన్న పనిదినాలను ఈ పథకం ద్వారా 125 రోజులకు పెంచామని, జీయో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతికతతో దొంగ లెక్కలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ పథకం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి, రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు కొనియాడారు. గతంలో ఒకే రోజు 13,226 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఘనత పవన్ కల్యాణ్కే దక్కిందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, గోకులాలు, ఫార్మ్ పాండ్లు నిర్మించామని, ఈ ఏడాది మరో 10 వేల కి.మీ గ్రావెల్ రోడ్లు, 1,500 కి.మీ సిమెంట్ రోడ్లను నిర్మించడమే కాకుండా.. పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా ఈ రామ్జీ పథకం కింద నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గాలేరు-నగరి ద్వారా కోడూరుకు నీళ్లు తెస్తామని, జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచుతామని భరోసా ఇచ్చారు.
రాయలసీమతో పాటు ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చంద్రబాబు వివరించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని చెప్పారు. రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తూ.. త్వరలోనే మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్లాంట్, పుట్టపర్తిలో ఆమ్కా ఫైటర్ జెట్ తయారీ యూనిట్, ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ రాబోతున్నాయన్నారు. బంగారం గనులు దొరికిన జొన్నగిరి పేరును 'స్వర్ణగిరి'గా మార్చామని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్వర్ణాంధ్ర సంకల్పాన్ని నిజం చేస్తామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
