AP Govt 500 New Thalli Bidda Express Vehicles:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతా–శిశు ఆరోగ్య భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులు క్షేమంగా, ఉచితంగా తమ ఇళ్లకు చేరుకోవడంతో పాటు, అత్యవసర వైద్య పరీక్షలు అవసరమయ్యే గర్భిణులకు రవాణా సదుపాయం కల్పించేందుకు నూతనంగా రూపుదిద్దుకున్న  తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్  వాహనాలను అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల సౌకర్యాలు , ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించేలా రూపొందించిన కొత్త బ్రాండింగ్ డిజైన్లను సీఎం క్షుణ్ణంగా సమీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.                 

Continues below advertisement

రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను ఈ పథకం కింద అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలతో పాటు వారి నవజాత శిశువులు, సహాయకులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం. దీనికి అదనంగా, అధిక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను క్రమం తప్పకుండా ఆసుపత్రులకు తీసుకువచ్చి పరీక్షలు అందించేందుకు కూడా ఈ సర్వీసులను వినియోగిస్తారు. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

బాలింతలు, పసిపాపల సౌకర్యార్థం ఈ వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలను అమర్చారు. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా పూర్తిస్థాయి ఎయిర్ కండిషనింగ్  వ్యవస్థతో పాటు, బాలింతలు వాహనంలోకి సులభంగా ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్ట్‌లు, వెనుక సీట్లలో ప్రయాణీకుల భద్రతకు సీటు బెల్టులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, అనుకోని అత్యవసర పరిస్థితులను తట్టుకునేలా ప్రథమ చికిత్స  కిట్లు, అగ్నిమాపక భద్రతా పరికరాలను వాహనంలో అందుబాటులో ఉంచారు.                           

Continues below advertisement

ఈ వాహనాల సేవలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి వాహనానికి జీపీఎస్  ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానించారు. దీని ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి వాహనాల కదలికలు, లొకేషన్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు వీలుకలుగుతుంది. సీఎం ఆదేశాల మేరకు వాహనాలకు సంబంధించిన అధికారిక స్టిక్కరింగ్ మరియు బ్రాండింగ్ ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించనున్నారు.                                  

కూటమి ప్రభుత్వంలో వైద్యారోగ్య రంగ రూపురేఖలు మారుస్తున్న క్రమంలో ఈ  తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల పునఃప్రారంభం ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రసవానంతర మరణాలను  సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.