AP Government State Funeral For Mudragada: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుదీర్ఘ కాలం పాటు ప్రజాసేవలో ఉన్న ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ అధికారిక లాంఛనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నేతలు అడ్డుపడటం అక్కడ తీవ్ర వివాదానికి దారితీసింది.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పించే అధికారిక గౌరవ వందనానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ, అక్కడ ఉన్న వైసీపీ నేతలు మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోమని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు అంతిమ సంస్కారాల క్రతువు ముగిసే సమయంలో, నిబంధనల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించడానికి సిద్ధమవగా.. వైసీపీ శ్రేణులు పోలీసులకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. అధికారిక లాంఛనాలు అంటే అది ఏదో టీడీపీ లేదా జనసేన పార్టీలు ఇస్తున్న రాజకీయ గౌరవం కాదని, ఒక మాజీ మంత్రికి ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించే అత్యున్నత గౌరవమని అక్కడ ఉన్న పలువురు నచ్చే చెప్పే ప్రయత్నం చేసిన వినలేదు.
మరోవైపు, కిర్లంపూడిలో బుధవారం ఉదయం నుంచే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ముద్రగడ కుమార్తెను కూడా అడ్డుకున్నారు. భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సదస్సును ముగించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన జగన్.. ఆయన పార్థివదేహాన్ని కొద్దిదూరం భుజాలపై మోశారు. జగన్ పర్యటన , అంత్యక్రియల ఏర్పాట్ల మధ్య వైసీపీ స్థానిక నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం గందరగోళానికి మరింత ఆజ్యం పోసింది.
సాధారణంగా ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైనా.. సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా సేవలందించినప్పుడు వారి అంతిమయాత్రను అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అనవాయితీ. కూటమి ప్రభుత్వం ముద్రగడకు ఈ గౌరవాన్ని కల్పించాలని ఆదేశించినప్పటికీ, కేవలం రాజకీయ కక్షసాధింపు కోణంలో వైసీపీ నేతలు ప్రవర్తించడంపై స్థానిక మేధావులు, తటస్థ కాపు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరణంలో కూడా రాజకీయాలు వెతుక్కుంటూ ప్రభుత్వ గౌరవాన్ని అడ్డుకోవడం ముద్రగడ వ్యక్తిత్వానికి భంగం కలిగించడమేనని అసహనం వ్యక్తం చేశారు.
ఈ రాజకీయ వివాదాలు, తోపులాటల మధ్యనే ముద్రగడ పద్మనాభ రెడ్డి అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి. ఇటు కుటుంబ సభ్యుల వేదన, అటు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ప్రభుత్వం కల్పించాలనుకున్న పూర్తి స్థాయి సైనిక వందనం గందరగోళం మధ్య పాక్షికంగానే ముగిసినప్పటికీ. పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసిన ఒక వివాదాస్పద శకం కిర్లంపూడి మట్టిలో శాశ్వతంగా కలిసిపోయింది.
