Chandrababu Tweet: టీడీపీ నేతలను అడ్డుకోవడం లేదా, అరెస్టు చేయడం లేకపోతే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) విమర్శించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేయడంపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నిమ్మల రామానాయుడును (Nimmala Ramanaidu) వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.


‘‘ప్రతి రోజూ టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో, అడ్డుకుంటేనో తప్ప ఈ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదు. నిన్న ప్రకాశం జిల్లాలో దళిత ఎమ్మెల్యే స్వామి గారిని అరెస్ట్ పేరుతో హింసించిన పోలీసులు.. నేడు దళితుల భూముల రక్షణ కోసం పోరాడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారిని అరెస్ట్ చేసి వేధించారు. ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం కాదని ఈ నియంతృత్వ పాలకులు తెలుసుకోవాలి. అక్రమాలు చేసే వైసీపీ నేతలకు.. అక్రమాలపై పోరాటం చేసే టీడీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు అర్థం చేసుకున్నారు. మున్ముందు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నిమ్మల రామానాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.






నిమ్మల రామానాయుడు ఏటిగట్టు పోరాటం


Palakollu MLA Nimmala Ramanaidu Protest: దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన మంగళవారం ఉద్రిక్తతలకు దారితీసింది. యలమంచిలి మండలం చించినాడ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. నిమ్మలను అరెస్ట్ చేయనీయకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. చివరకు ఎమ్మెల్యే రామానాయుడిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


చించినాడలో దళితుల భూముల స్వాధీనానికి సర్కారు కొంతకాలంగా ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్ధతుగా నిన్నటి నుంచి రామానాయుడు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. మరుసటి రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు.