Chandrababu Naidu severely criticized Jagan during his visit to Tadipatri:  ఏపీపై జగన్ పగబట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.  తాడిపత్రి నియోజకవర్గంలోని  యాడికి  మండలంలో జలధార -సాగునీటి భద్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.  పర్యటనలో భాగంగా సీఎం మొదట అత్తిరాళ్లదిన్నె సమీపంలోని పెండేకల్లు జలాశయానికి   చేరుకున్నారు. అక్కడ  జలధార  కార్యక్రమంలో భాగంగా కృష్ణా జలాలకు శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాలను బలోపేతం చేసేందుకు , భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన 100 రోజుల  వాటర్ సెక్యూరిటీ యాక్షన్ ప్లాన్ ను ఆయన తాడిపత్రి వేదికగానే అధికారికంగా ప్రారంభించారు.

Continues below advertisement

యాడికిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక లో సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు, అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. హంద్రీనీవా కాలువ విస్తరణ, పెండేకల్లు రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా,భూగర్భ జలాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు.  అనంతరం యాడికి మార్కెట్ యార్డ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్'గా మార్చేందుకు 1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, అందులో ప్రభుత్వ వాటాగా 30 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. 

తాడిపత్రి సభలో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో గర్జించారు. ఐదేళ్లలో తాడిపత్రిలో అరాచక పాలన సాగింది. నా తమ్ముళ్లను చిత్రహింసలకు గురిచేశారు, అక్రమ కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు సమయం మారింది, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం అని హెచ్చరించారు. తాడిపత్రిలో రౌడీయిజానికి తావులేదని, అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ విచిత్రమైన పేర్లతో రాజధాని అంటున్నారని ఆయన ఏపీపై పగబట్టారన్ననారు. 

Continues below advertisement

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి  ముఖ్యమంత్రికి రాజధాని  అమరావతి లోగోతో కూడిన ప్రత్యేక బ్యాడ్జ్‌ను బహుకరించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు సంకల్పానికి తాము పూర్తి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా జేసీ కుటుంబం ప్రకటించింది. చంద్రబాబు కూడా ఆ బ్యాడ్జ్‌ను ఎంతో ఇష్టంగా స్వీకరించి, తన చొక్కాపై ధరించారు.  చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నట్లు భావించిన  జేసీ పవన్ రెడ్డి ఈ పర్యటనలో యాక్టివ్‌గా కనిపించారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ,  పవన్ రెడ్డిలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జేసీ పవన్ రెడ్డితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఈ భేటీతో జేసీ కుటుంబం లోపల ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయాయని, వారు మళ్లీ ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నారని కేడర్ భావిస్తోంది. రాజకీయ విమర్శలే కాకుండా, తాడిపత్రి అభివృద్ధికి చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా హంద్రీనీవా కాలువ ద్వారా తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించే ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. స్థానిక పరిశ్రమలు, మైనింగ్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాడిపత్రిని జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన ప్రకటించారు.  చంద్రబాబు తాడిపత్రి పర్యటన జేసీ కుటుంబానికి రాజకీయంగా పెద్ద బూస్ట్‌ను ఇచ్చింది. అస్మిత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూనే, పాత కొత్త కలయికతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు చేసిన సూచనలు కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.