Latest news Of Chandra Babu Cases: టీడీపీ అధినేత (Tdp Chief ) చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )పై కేసుల పరంపరను జగన్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ సీఐడీ (Cid)లో ఆయనపై మొత్తం 8 కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నింటిలోనూ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న వారేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్న అనుచర బృందమేనని కామెంట్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానం, మద్యం విధానంపైన నమోదు చేసిన కేసుల్లో ప్రభుత్వాధికారులు ఫిర్యాదులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి కేసు, ఫైబర్‌గ్రిడ్‌ కేసుల్లో నామినేటెడ్‌ పదవులు పొందిన అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అమరావతి ఎసైన్డ్‌ భూముల కేసుల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చంద్రబాబుపై వరుసగా ఐదు కేసులు నమోదయ్యాయి. 


ఏ యే కేసులు ఏ స్థాయిలో ఉన్నాయంటే...
1 ) స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయన అనారోగ్యం పాలవడంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు ఆయన బయటే ఉండనున్నారు. ఇదే కేసులో చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై విచారణ 15న జరగనుంది.


2 )  స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత సీఐడీ ఇసుక కుంభకోణం కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్‌ 22కి తదుపరి విచారణ జరగనుంది.


3 ) ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు విచారణ వాయిదా పడింది.


4) అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ వచ్చింది. చంద్రబాబు ఏ1గా , మరో 170 మంది ఇతర నిందితులపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.


5 ) ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది.


6 ) మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ నెల 21కి విచారణ వాయిదా పడింది.


గత నెల 31న జైలు నుంచి బెయిల్ పై విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల అయ్యారు. తమ అధినేత విడుదల కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. రాజమండ్రి నుంచి విజయవాడకు రావడానికి 14గంటల సమయం పట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నపుడు కూడా బేగంపేట విమానాశ్రాయం నుంచి జూబ్లీహిల్స్ వరకు జనం ర్యాలీ నిర్వహించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. దాదాపు 2గంటల పాటు వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.