Chandrababu Naidu Arrest: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర ప్రజలు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తూ.. బంద్ పాటిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజక వర్గంలోని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద టీడీపీ ఇంచార్జ్ నజీర్.. బస్సులను ఆర్టీసీ డిపోలికి పంపిస్తున్నారు. డిపోలోని డ్రైవర్లు అందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రయాణికులు స్వచ్ఛందంగా ఇళ్లకు వెళ్లిపోయారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసు నిర్బంధాన్ని దాటుకొని బయటికి వచ్చిన పరిటాల సునీత.. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే పోలీసులు పరిటాల సునీతను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలిస్తుండగా... టీడీపీ శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కానీ పోలీసులు సునీతతో పాటు టీడీపీ శ్రేణులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.


శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరిటాల శ్రీరామ్ అరెస్ట్ చేశారు. ఉదయం పరిటాల శ్రీరామ్ ను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా.. వారి కళ్లు గప్పిన పరిటాల శ్రీరామ్ గోడ దూకి మరీ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు కూడా అక్కడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ శ్రేణులతో పాటు పోలీసులను కూడా అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈక్రమంలోనే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మరోవైపు బాబు అరెస్టును ఖండిస్తూ.. బందు సాగిస్తున్న బుద్ధ వెంకన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అలాగే ఓ సీనియర్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కిన తనన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతల పట్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత‌ నారా చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలపై అరెస్టు చేయడంపై వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ముందస్తుగా టీడీపీ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 


పూతల పట్టులో శాంతియుతంగా ఇంఛార్జ్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అయితే నిరసను అడ్డుకున్న పోలీసులు మురళిమోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలిసులు నియోజకవర్గం ఇంఛార్జ్ మురళీ మోహన్ తో పాటుగా, నాయకులను పోలీసు స్టేషనుకు తరలించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ తెదేపా నాయకులు నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబుకు బెయిల్ రావాలని పూజలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఆయనకు బెయిల్ రావాలని స్వగ్రామమైన చంద్రగిరి, నారావారిపల్లెలో టీడీపీ నాయకులు, గ్రామస్థులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నాయకులు దేవిలాల్, గుడిమల్లం చెంగల్రా యాచారి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారావారిపల్లెలోని బాబు తల్లితండ్రుల సమాధులకు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు కులదైవం నాగాలమ్మకు పూజలు చేశారు. కందులవారిపల్లె సర్పంచ్ లక్ష్మి, నాయకులు నిరంజన్నాయుడు, శ్రీకాంత్ చౌదరి, నారా సుబ్రమణ్యం నాయుడు, తోకల రమేష్, జ్ఞానశేఖర్ పాల్గొన్నారు.


అలాగే విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసరావు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావు తీవ్ర గాయాల పాలయ్యారు. పలాస జిల్లా శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ.. యల్లమంచిలి అసెంబ్లీ నియోజక వర్గంలోని టీడీపీ నాయకులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.