ఆంధ్రప్రదేశ్‌కు తానే చివరి సీఎం అని.. ఇక ఏపీ ఉండదన్నట్లుగా రాష్ట్ర ఆస్తులు అమ్మకం, తాకట్టు పెడుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ( CM Jagan  ) చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన రెండున్నరేళ్లలో  రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. అసలు చేసిన అప్పులన్నీ ఎక్కడికిపోయాయనని ప్రశ్నించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న బెరంపార్క్‌ను ప్రైవేటు బ్యాంకుకు తాకట్టు పెట్టడంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని విమర్శించారు. 


ఓ వైపు ఆస్తులు అమ్ముతూ మరోవైపు పన్నుల రూపంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని చంద్రబాబు ( Chandra babu ( విమర్శించారు. చివరికి చెత్త పన్ను కూడా వేశారన్నారు. పన్నులు అధికంగా వేయడంతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అత్యధికంగా ఉంటోంది ఏపీలోనేనన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, లిక్కర్ ధరలు దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చిచూసినా ఎక్కువేననన్నారు. వైఎస్ఆర్‌సీపీ ( YSRCP )అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏపీకి ఎవరూ చేయనంత నష్టాన్ని జగన్ ఏపీకి చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్ భయంకరంగా ఉంటుందన్నారు. 


సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత లాభం తప్ప ఏమీ పట్టడం లేదని సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ( White Paper  )  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దేశమంతా ఎంతోకొంత పరిహారం ఇచ్చినా జగన్‌రెడ్డి మాత్రం రూపాయి సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


సంపద సృష్టించకుడా రాష్ట్ర ఎంపీలు ఢిల్లీకి పోయి అప్పుల కోసం అడుక్కుంటున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై ( Polavaram ) టీడీపీ హయాంలో ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అవే ఎస్టిమేషన్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. పోలవరం పని ఎక్కడిదక్కడ ఆగిపోయింద‌న్నారు. టీడీపీ హయాంలో ప్రకటించిన రైల్వేజోన్‌కు కనీసం నిధులు సాధించలేని దుస్థితిలో వైసీపీ ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పేర్కొన్నారు.  


సీఎం జగన్ పలు అంశాల్లో మాట తప్పిన వీడియోలను, టీడీపీ హయాంలో చేసిన పనులనుకూడా తాను చేసినట్లుగా  చెప్పుకున్న వీడియోలను చంద్రబాబ ప్రదర్శించారు.