Bill Gates visited farm in Amaravati : బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో భేటీ అనంతరం ఆయన నేరుగా ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ డ్రోన్ల వినియోగం, ఏఐ ఆధారిత సాగు విధానాలను రైతుల ద్వారా నేరుగా అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఈ స్థాయి సాంకేతికతను వాడటం లేదని, ఆంధ్రప్రదేశ్ ఇందులో ముందుందని ఆయన కొనియాడారు.
పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రుచులను ఆస్వాదించారు. వ్యవసాయ క్షేత్రం వద్ద రైతులు, అధికారులతో కలిసి ఆయన స్థానిక టిఫిన్ రకాలను రుచి చూశారు. ముఖ్యంగా వేడివేడి పుణుగులు, బొండాలను ఆయన ఎంతో ఇష్టంగా రుచి చూశారు.
గతంలో కూడా ఆయన ఇండియా పర్యటనలో స్థానిక టీ , వడలను రుచి చూశారు. అదే బాటలో అమరావతిలో కూడా స్థానిక రుచులకు ఆయన ఫిదా అయ్యారు.
సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం, వ్యవసాయంలో టెక్నాలజీని విస్తరించడంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యటన ముగించుకుని ఆయన తిరిగి ముంబైకి బయలుదేరి వెళ్లారు.
