Avinash Reddy accuses Sunitha in Viveka murder case:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కావాలనే కొన్ని వాస్తవాలను సునీతారెడ్డి దాస్తున్నారని, రాజకీయ ప్రేరేపిత అంశాలతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. 

Continues below advertisement

లెటర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?                                      

సునీతారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె కీలక అంశాలను పక్కదారి పట్టిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య జరిగిన సమయంలో గదిలో దొరికిన లెటర్ గురించి ఎందుకు దాచారో ఇప్పటికీ సమాధానం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ లేఖలో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉందని, దానిని బయటపెడితే అసలు విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే అప్పట్లో గోప్యంగా ఉంచారని ఆయన విమర్శించారు.  సీబీఐ విచారణ తీరుపై కూడా అవినాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. విచారణ సంస్థలు ఒకే పక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని, సాక్ష్యాలను పరిశీలించకుండా కేవలం వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగానే తనపై ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి విచారణకు సహకరిస్తున్నానని, కానీ కావాలనే తన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

హత్య జరిగిన రోజు లేని అనుమానాలు .. తర్వాత వచ్చాయి!       

హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, అప్పుడు సునీతారెడ్డికి , తనకు మధ్య జరిగిన సంభాషణలను ఆయన గుర్తు చేశారు. అప్పట్లో లేని అనుమానాలు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వస్తున్నాయని  ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకే కొన్ని శక్తులు సునీతారెడ్డిని వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

హంతకుడు అయిన దస్తగిరికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు?                    

తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధితురాలు అని చెప్పుకుంటున్న సునీతారెడ్డి, నిందితుడిగా ఉన్న దస్తగిరికి మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రజలకే తెలియాలని ఆయన అన్నారు.   వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, అప్పుడే అసలు హంతకులు ఎవరో ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు.