Arunachalam Temple -  Tiruvannamalai Special Train: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిరోజు అగ్నిలింగ క్షేత్రం పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతుంటుంది. అరుణాచలం గిరిప్రదక్షిణ ఏ రోజు చేసినా మంచిదే కానీ పున్నమి రోజు మరింత ప్రత్యేకం అని భావిస్తారు భక్తులు. పైగా గురుపౌర్ణమి సందర్భంగా అగ్నిలింగ క్షేత్రానికి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలనుంచి బయలుదేరే భక్తులకు..ముఖ్యంగా గోదావరి జిల్లా భక్తులకు శుభవార్త.  ఇకపై నరసాపురం నుంచి నేరుగాతిరువన్నామలై (అరుణాచలం ) కు  డైరెక్ట్ ట్రైన్ వేసింది రైల్వే శాఖ.

బుధవారం  మధ్యాహ్నం (09.07.2025) ఒంటి గంటకు నరసాపురం నుంచి బయలు దేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం  4:55కు తిరువన్నామలై చేరుకుంటుంది. దీనితో గోదావరి జిల్లాల ప్రజలకు అరుణాచలం క్షేత్రానికి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చినట్టు అయింది. అంటే సరిగ్గా గురు పౌర్ణమి రోజు ఈ ట్రైన్ అరుణాచలం చేరుకుంటుంది. 

గురు పౌర్ణమి సందర్భంగా మాత్రమే కాదు..ఇకపై ప్రతి బుధవారం ట్రైన్ నెంబర్  07219 నరసాపురం నుంచి తిరువాన్నామలై కు అందుబాటులో ఉంటుంది

07219 నెంబర్ తో నడిచే ఈ రైలు ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1గంటకు నరసాపురం లో బయలుదేరి పాలకొల్లు,భీమవరం జంక్షన్, భీమవరం టౌన్,ఆకివీడు, కైకలూరు, గుడివాడ మీదుగా విజయవాడ కు సాయంత్రం 4:20కు చేరుకుంటుంది. అక్కడ పదినిముషాలు ఆగి 4:30కి బయలుదేరి తెనాలి, బాపట్ల, చీరాల,ఒంగోలు,నెల్లూరు, రేణిగుంట,తిరుపతి(రాత్రి 11:30), పాకాల, చిత్తూరు,కాట్పడి, వెల్లూరు కాంట్ మీదుగా గురువారం ఉదయం 4:55కి తిరువన్నామలై  చేరుకుంటుంది. తిరుగుప్రయాణం లో 07220 నెంబర్ గల ట్రైన్ తిరువన్నామలై లో గురువారం ఉదయం 11గంటలకు బయలుదేరి  తిరుపతి (మధ్యాహ్నం 2:30),విజయవాడ (రాత్రి 9pm ) మీదుగా (శుక్రవారం అర్ధరాత్రి 2గంటలకు) నరసాపురం చేరుకుంటుంది.  ఈ ట్రైన్ వల్ల అరుణాచలం కు డైరెక్ట్ ట్రైన్ మాత్రమే కాకుండా గోదావరి జిల్లాల ప్రజలకు తిరుపతి కి కూడా మరో క్రొత్త ట్రైన్ వచ్చినట్లయింది.  

చార్జీలు ఇవే 

ఈ ట్రైన్ లో నరసాపురం నుంచి తిరువన్నామలై కు  స్లీపర్ లో 515, 3AC లో 1385,2AC లో 1950  రూపాయల చార్జీ ఉంటుంది.  ట్రైన్ లో 4జనరల్ బోగీలు,14 స్లీపర్ బోగీలు, రెండు 3AC, ఒక 2AC బోగీలు ఉంటాయి.  

అరుణాచలానికి పెరుగుతున్న భక్తుల రద్దీ 

ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల నుంచి అరుణాచలం క్షేత్రానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా కొండ పైన, కొండ కింద శివ క్షేత్రాలు ఉంటాయి. కానీ అరుణాచలంలో ఆ కొండనే  శివుడు గా భావించి  గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇక్కడ ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కూడా బాగా ఫేమస్. అరుణాచలంలో గురుపూర్ణిమ రోజు  ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. సరిగ్గా అదే రోజుకి  తిరువన్నామలై చేరుకునేలా  ఈ వీక్లీ ట్రైన్ ను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. ముందుగా మూడు నెలల పాటు  ప్రయోగాత్మకంగా నడిపి  ప్రయాణికుల రెస్పాన్స్ ని బట్టి  ఈ ట్రైన్ ని పెర్మనెంట్ చేసే ఆలోచనలో రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నట్టు సమాచారం.

విజయవాడ నుంచి కూడా తిరువన్నామలై కు ప్రస్తుతం ప్రతీ సోమ, మంగళ, శుక్ర, శని వారాల్లో  డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉండగా  ఇప్పుడు ఈ కొత్త ట్రైన్ ద్వారా ప్రతి బుధవారం కూడా డైరెక్ట్ రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది.  తెలుగు ప్రాంతాల నుంచి అరుణాచలానికి  వెళ్లే భక్తులకు ముఖ్యంగా స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులకు సౌకర్యంతమైన రవాణా సాధనం ఏర్పడినట్టు అయిందంటున్నారు భక్తులు

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!