Andhra Pradesh Weather Updates | అమరావతి: రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకోనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం, మంగళవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని పేర్కొన్నారు.

Continues below advertisement

వీటి ప్రభావంతో ఏప్రిల్ 6, 7 తేదీల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లి నిల్చోవద్దని ఆయన హెచ్చరించారు.

సోమవారం, మంగళవారాల్లో ఏపీలో వాతావరణం ఇలా ఉంటుంది...

Continues below advertisement

- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

సోమవారం నాడు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. 

40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

ఆదివారం (ఏప్రిల్ 6) నాడు పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని  నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో 42.3°C, మార్కాపురం జిల్లాలోని నందన మారెళ్లలో 41.8°C, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, ప్రకాశం జిల్లాలోని చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు జిల్లాలోని తోవి, శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాంలో 40.7°C, అనంతపురం జిల్లాలోని భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు జిల్లాలోని గురజాలలో 40.4°C, విజయనగరం జిల్లాలోని సంతకవిటిలో 40.3°C, నంద్యాలలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు, 66 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.