AP Municipal Elections 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. మార్చి 9వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం ముగియ వస్తుండటంతో, సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. కొత్త ఓటర్ల జాబితా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నీలం సాహ్ని నోటిఫికేషన్లు జారీ చేశారు.
త్వరలో ముగియనున్న మున్సిపాలిటీల పదవీకాలం..
ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. మరోవైపు గ్రామ పంచాయతీలో పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుంది. మున్సిపల్ పోరుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లాల వారీగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. మార్చి 9న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మొదట మున్సిపాలిటీ, తరువాత పంచాయతీ ఎన్నికలు..
ఏపీలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13,351 పంచాయతీలలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలు కానున్నాయి. ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితాకు నోటిఫికేషన్ రావడమంటే ఎన్నికల నగరాలో తొలి ఘట్టం అని తెలిసిందే. స్థానిక సంస్థల నోటిఫికేషన్ తేదీపై స్పష్టత రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ రాజకీయ సమీకరణాలు మొదలుపెడతాయి.
