Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Venkatrami Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయన పై ఆరోపణలు నిరూపితం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Venkatrami Reddy dismissed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఉద్యోగి హోదాలో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడిన సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘం నేతగా ఉంటూనే వైసీపీకి అనధికార ప్రతినిధిగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనను, సర్వీస్ నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ కూటమి ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయాలకు, ప్రభుత్వ సర్వీసులకు మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖను ఆయన పూర్తిగా తుడిచివేసినట్లు విచారణలో తేలింది.
వెంకట్రామిరెడ్డిపై ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిబంధనలను అతిక్రమించారనే ఫిర్యాదులు ఉన్నాయి. కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో రహస్య సమావేశం నిర్వహించి, వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆయన ఓట్లు అభ్యర్థించారు. దీనిపై అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో, ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ పదవి నుండి సస్పెండ్ చేశారు. అయితే, ఈ సస్పెన్షన్ కాలంలోనూ ఆయన తన పద్ధతి మార్చుకోలేదని తేలింది.
సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగి తప్పనిసరిగా హెడ్క్వార్టర్స్లోనే ఉండాలనే నిబంధనను పక్కనపెట్టి, వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని తాజా విచారణలో వెల్లడైంది. ఇతర ఉద్యోగులను సమీకరించి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అడ్డుతగిలేలా ప్రలోభపెట్టడం, రహస్య రాజకీయ మంతనాలు జరపడం వంటి అభియోగాలు రుజువయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల ప్రయోజనాలను గాలికొదిలేసి, కేవలం అధికార పార్టీ అజెండాను అమలు చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేశారనేది విచారణాధికారులు నిర్దారించినట్లుగా తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల కోసం మద్యం విందులు ఏర్పాటు చేసి, వారిని రాజకీయంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఆయనపై నిర్ధారణ అయ్యాయి. ఉద్యోగ సంఘం ఎన్నిక సందర్భంగా ఆయన మద్యం విందుతో పార్టీ ఇస్తూ దొరికిపోయారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజ్యాంగబద్ధమైన తటస్థతను పాటించకుండా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరించడం సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం తీవ్రమైన నేరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆయనను విధుల్లోకి తీసుకునే అవకాశం లేకుండా బర్తరఫ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేసే వారికి ఈ బర్తరఫ్ వేటు ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపు , రాజకీయ ప్రచారం వంటి అంశాల్లో ఆయనపై ఉన్న ఇతర అభియోగాలపై కూడా లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. తన డిస్మిస్ పై వెంకట్రామిరెడ్డి న్యాయపోరాటం చేస్తారా.. వైసీపీలో చేరి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారుతారా అన్నది చూడాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు


















