Andhra Pradesh Universal Health Policy:   ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ'(UHP)ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నారు.  జనవరి 2026  నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తున్న ఈ పథకం ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ అందించనుంది. పేదలకు ప్రత్యేక వరంగా రూ.5 లక్షల వార్షికాదాయం లోపు కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ఈ పథకంతో రాష్ట్రంలోని 1.43 కోట్ల పేద కుటుంబాలకు మేలు చేకూరుతుందని మొత్తం 5 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ ప్రకటించారు.    

ఏపీలోని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ          

ప్రస్తుతం  'డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ' పథకం అమల్లో ఉంది. ఈ పథకం కింద 24 గంటల్లో అందించే ఉచిత వైద్య సేవలను ఈ కొత్త భీమా పథకం ద్వారా 6 గంటల్లోపు అందించనున్నారు. ప్రస్తుతం 3,257 రకాల సేవలు అందుతున్నాయి. కొత్త విధానంలో కూడా ఇవి కొనసాగుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి, నిధఉలు దుర్వినియోగం కాకుండా సమర్థవంతంగా వినియోగించేలా రూపొందించారు.  ఈ పథకం ప్రజలకు వరం అని విజయ్ కుమార్ చెబుతున్నారు.  అందరికీ ఆరోగ్య రక్షణను హామీ ఇస్తుందన్నారు.     

రూ. పాతిక  లక్షల వరకూ క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్           

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా అందుతుంది. ముఖ్యంగా, వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న పేద కుటుంబాలకు బీమా సంస్థల ద్వారా రూ.2.50 లక్షల వరకు నగదురహిత చికిత్స అందుతుంది. ఈ పథకంతో 1.43 కోట్ల పేద కుటుంబాలు, మొత్తం 5 కోట్ల ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇది రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన ఆరోగ్య కేంద్రాల (PHC) ,  పట్టణ ఆరోగ్య కేంద్రాల (UHC) అభివృద్ధికి రూ.194 కోట్లు కేటాయించారు.                 

సంక్రాంతి నుంచి అమలు                  

ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ నేతృత్వంలో 30 పాయింట్ల ఆరోగ్య సంస్కరణలు అమలులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రజలకు వేగంగా అందించాలని అధికారులకు సూచించారు. "సంక్రాంతి నుంచి ప్రతి పేదవారి ఇంటి ముందు ఆరోగ్య రక్షణ హామీ" అంటూ ప్రభుత్వం ప్రచారం కూడా చేస్తోంది. ప్రజలు ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం స్థానిక ఆరోగ్య కేంద్రాలు లేదా టోల్ ఫ్రీ నంబర్ 104కు సంప్రదించవచ్చు. ఈ పథకం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు మైలురాయిగా మారనుందని, పేదలకు నిజమైన వరం అవుతుందని విజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.