AP Liqour Scam: తవ్వేకొద్దీ ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.  ఏపీ లిక్కర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT విచారణలో ఆసక్తి గొలిపే ఓ కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఏపీ టూ దుబయ్ వయా హైదరాబాద్ మీదుగా సాగిన డబ్బుల దందాలో విస్తుగొలిపే మరో విషయం వెలుగుచూసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందుతులకు తెలంగాణ ట్యాపింగ్ స్కామ్ నిందితుడు శ్రవణ్‌రావు ఆశ్రయం కల్పించాడు. అది కూడా దుబయ్‌లోని తన సొంత ఫ్లాట్‌లో వాళ్లని దాచి ఉంచినట్లుగా SIT గుర్తించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. 

దుబయ్‌లో షెల్టర్ తీసుకున్న చాణక్య, కిరణ్‌

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన కిరణ్ కుమార్ మరియు చాణక్య దుబాయ్‌లో ఉన్న ఒక అపార్టుమెంట్‌లో తలదాచుకున్నట్లు ఎస్ఐటీ SIT దర్యాప్తులో తేలింది. ఈ ఫ్లాట్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఆ. శ్రవణ్ రావుకు చెందినదిగా గుర్తించారు. శ్రవణ్ రావు  తెలంగాణలో ఐటీ శాఖలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అతని ఆస్తులపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు అదే ఫ్లాట్‌లో ఏపీ మద్యం మాఫియాలో నిందితులు దాగి ఉండడం సంచలనంగా మారింది. ఎస్ఐటీ అధికారులు దుబాయ్‌కు వెళ్లే ముందు ఈ సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని సమాచారం.

29సార్లు దుబయ్ వెళ్లిన కిరణ్

ఏపీలో మద్యం కుంభకోణంపై దర్యాప్తు మొదలైన తర్వాత ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన కిరణ్‌కుమార్ డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకూ 29సార్లు దుబయ్‌ వెళ్లారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా సంపాదించిన సొమ్మును చేరవేయండంలో కిరణ్, చాణక్య కొరియర్లుగా వ్యవహరించారు. ఏపీలో కేసు నమోదు అయిన వెంటనే దీంతో సంబంధం ఉన్న కిరణ్ కుమార్ దుబయ్‌కు పారిపోయాడు. దుబయ్‌లో శ్రవణ్‌కుమార్‌కు చెందిన ఫ్లాట్‌లోనే ఉంటున్నాడు. దాదాపు నెలకు 5లక్షలకు పైగా అద్దె వచ్చే ఆ ఫ్లాట్‌ను శ్రవణ్ 2024 నుంచి ఖాళీగానే ఉంచినట్లు చూపించారని.. లిక్కర్‌ కేసు నిందితులకు షెల్టర్‌గా దానిని వాడుతున్నారని SIT ఆరోపిస్తోంది.

దుబయ్‌ వేదికగా హవాలా దందా

ఆంధ్ర కుంభకోణం నిందుతులకు తెలంగాణ వ్యక్తులు సాయం చేయడంతో.. రెండు రాష్ట్ట్రాల్లో కుంభకోణాలకు పాల్పడిన నిందుతుల మధ్య గట్టి సంబంధాలున్నట్లుగా అర్థం అవుతోంది. ఆంధ్ర తెలంగాణలో అక్రమంగా సంపాదించిన నిధులను హవాలా మార్గంలో దుబయ్ తరలించేవారని అక్కడి నుంచి వివిధ రూపాల్లో మళ్లీ వెనక్కు తీసుకొచ్చేవారని SIT దర్యాప్తులో తేలింది. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డికి ట్యాపింగ్ కేసులో కీలక నిందుడైన శ్రవణ్‌కుమార్‌కు సాన్నిహిత్యం ఉంది. దాదాపు 3200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని SIT చెబుతోంది. వివిధ మార్గాల్లో బినామీలకు డబ్బులు ట్రాన్సఫర్ అయ్యాయి. నిధులను హవాలా మార్గంలో దేశం దాటించడంతో ED కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. మద్యం కుంభకోణం డబ్బులు ఎలా దేశం దాటి వెళ్లాయో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా హవాలా నెట్‌వర్క్‌కు దుబయ్‌ కేంద్రంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు శ్రవణ్‌ రావు లింక్ దొరకడంతో ఆయనకూ హవాలా నెట్‌వర్క్‌కు ఏమైనా సంబంధం ఉందా అని కూడా ED ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్‌లో సంపాదించిన సొమ్ముతో రాజ్ కసిరెడ్డి.. హైదరాబాద్‌ శివార్లలో 90 ఎకరాలు కొన్నారు. ఇందులో ఇప్పటికే 60 ఎకరాలు విక్రయించగా.. ఇంకా ౩౦ ఎకరాలు బినామీ పేర్లతో ఉంది. రాజ్‌కసిరెడ్డి హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శ్రవణ్‌కుమార్ కూడా భాగస్వామి అని భావిస్తున్నారు.