AP High Court Mega DSC Verdict: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై వరుస ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటానికి దిగిన విపక్ష వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో  ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, పేపర్ లీకేజీతో పాటు స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది.  ఈ దశలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని విస్పష్టంగా ప్రకటిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.  విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన ధర్మాసనం పిటిషనర్ వైఖరిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. 

Continues below advertisement

ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల  ప్రాథమిక ఉద్దేశాన్ని గుర్తుచేసిన న్యాయస్థానం.. కేవలం  రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పిల్ వ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని ఘాటుగా హితవు పలికింది. స్వచ్ఛమైన ప్రజా ప్రయోజనం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వేసే ఇటువంటి పిటిషన్లను అనుమతిస్తే  పిల్  వ్యవస్థ   పవిత్రత ,  న్యాయసూత్రాల ఉద్దేశం పూర్తిగా దెబ్బతింటాయని బెంచ్ తీవ్రంగా హెచ్చరించింది.  ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ధర్మాసనం పిటిషనర్ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది.  స్పోర్ట్స్ కోటా వల్ల ఎవరైనా అర్హులైన అభ్యర్థులు నష్టపోతే, బాధితులే నేరుగా న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించడం లేదు? అని నిలదీసింది. అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కడానికి భయపడుతున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. న్యాయం కోసం వచ్చే ఏ బాధితుడికి కోర్టును ఆశ్రయించడానికి ఎలాంటి భయాలు ఉండవని స్పష్టం చేస్తూ పిటిషనర్ ధోరణిని తప్పుపట్టింది. డీఎస్సీపై 335 పిటిషన్లు దాఖలయ్యాయన్న విషయాన్ని గుర్తుచేసింది. 

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. అయితే, మొదటి నుంచి ఈ నియామకాలపై  మెగా స్కామ్  అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,  మాజీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ప్రశ్నాపత్రాల తయారీ, మెరిట్ జాబితా విడుదల, స్పోర్ట్స్ కోటా రూల్స్ మార్పుపై రాజకీయాన్ని హీటెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ.. న్యాయపరంగా బలమైన ఆధారాలు చూపించలేక కోర్టులో పిటిషన్లు నిలబడకపోవడం వైఎస్సార్‌సీపీని తీవ్ర డిఫెన్స్‌లో పడేసింది.  

Continues below advertisement

నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ వాదనకు కోర్టు వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. రాజకీయ మైలేజ్ కోసం నిరుద్యోగుల్లో అయోమయం సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ ఆడుతున్న డ్రామాలను హైకోర్టు తీర్పు బట్టబయలు చేసిందని అధికార పక్షం కౌంటర్ దాడి పెంచగా.. న్యాయస్థానం వ్యాఖ్యలతో విపక్షం డిఫెన్స్‌లో పడటంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర సంచలనంగా మారింది.