Pradhan Mantri Fasal Bima Yojana | అమరావతి: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్త అందించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY)తో పాటు, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా మొత్తాలను ఆయా ప్రభుత్వాలు భరించనున్నాయి. ఏయే జిల్లాల్లో ఏ బీమా సంస్థలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి, ఏ పంటలకు ఇది వర్తిస్తుంది, నమోదు చేసుకోవడానికి చివరి తేదీలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య, ఈ-క్రాప్ ధ్రువీకరణపంటల బీమా పథకానికి నమోదు చేసుకోవడానికి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2026–27 నుంచి ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకునే రైతులకు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదైన ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. అయితే, దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇంకా ఆదేశాలు రాలేదు. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే, ఈ ఫార్మర్ ఐడీతో సంబంధం లేకుండానే రైతులు నమోదు చేసుకోవచ్చు.
ఈ బీమా పథకంలో చేరాలా వద్దా అనేది పూర్తిగా రైతుల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. పంట రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం వసూలు చేస్తాయి. ఒకవేళ బీమా వద్దనుకుంటే రైతులు ఆ మేరకు పత్రం సమర్పిస్తే బ్యాంకుల్లో ప్రీమియం మినహాయించరు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 26 పాత జిల్లాల ప్రాతిపదికన అమలు చేయనుండగా, బీమా నమోదు సమాచారాన్ని ఈ-పంట (e-Panta) డేటాతో అధికారులు ధ్రువీకరించనున్నారు.
ఖరీఫ్లో: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (PMFBY) కింద వరికి ఆగస్టు 15, ఇతర అన్నిరకాల నోటిఫైడ్ పంటలకు జులై 31 వరకు నమోదు చేసుకోవచ్చు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్నిరకాల నోటిఫైడ్ పంటలకు జులై 15లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
రబీలో: ఈ పథకం కింద వరికి డిసెంబర్ 31, ఇతర అన్నిరకాల నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అయితే వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జీడిమామిడికి నవంబర్ 15 వరకు, టమాటాకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎంఎఫ్బీవై అమలు సంస్థ, జిల్లాలు
జనెరాలి సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ: అనంతపురం, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల, పల్నాడు, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం.
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్: చిత్తూరు, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం.
ఐసీఐసీఐ లాంబార్డ్: ప్రకాశం, అన్నమయ్య, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు.
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ: విజయనగరం, పశ్చిమ గోదావరి, శ్రీసత్యసాయి.
Also Read: ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు సంస్థ, జిల్లాలు
ఇండస్లాండ్ ఇన్సూరెన్స్: కర్నూలు జిల్లా
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ: అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, నంద్యాల, అనంతపురం,
ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, తూర్పు గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి
