AP Contract Employees Regularisation: అమరావతి: రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉమ్మడి ఏపీ విభజనకు ముందే అంటే 2014 జూన్ కు ముందే 5 ఏళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 
మంత్రి బొత్స సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం అని పేర్కొన్న ఆయన.. తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్ పై ఎల్లుండి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. దాంతో పాటు   కొత్త పెన్షన్‌ విధానంపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ఏ నష్టం, కష్టం కలగకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి బొత్స అన్నారు.