AP CID issues notices to Vijayasai Reddy:  మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఏ కేసులో అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కాకినాడ పోర్టు కేసులో కావొచ్చని భావిస్తున్నారు.  కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఈడీ కూడా విచారణకు పిలించింది కానీ సీఐడీ ఇంకా పిలువలేదు. ఆ కేసులో ఇప్పుడు విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు. నోటిసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లును పేర్కొన్నారు. ఇవి కఠినమైన సెక్షన్లుగానే భావిస్తున్నారు. 


కాకినాడ పోర్టు కేసులోనే నోటీసులు?                   


కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు  సీఐడీకి ఫిర్యాదు చేశారు.  ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్‌ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్‌ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈకేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.                      


ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయి                                   


ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయ న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు.అయితే ఆయన వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో  ప్రభుత్వ అధికారాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలను సీఐడీ  చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.             


విచారణకు హాజరవుతారా ? 


అయితే పోర్టులో వాటాలను .. తిరిగి కేవీరావుకు ఇచ్చేసి రాజీ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో స్పష్టత లేదు.బుధవారం విజయసాయిరెడ్డి సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు  చేయకూడదన్న ముందస్తు ఆదేశాలేమీ లేవు.  దీంతో విచారణకు హాజరవుతారా.. గడువు కోరుతారా అన్నది సస్పెన్స ్గా మారింది.