Inquiry committee on TTD adulterated ghee: తిరుమల లడ్డూ కల్తీ  కేసు విషయంలో సిట్ చేసిన సిఫారసుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించాలని నిర్ణయించింది.  కల్తీ సూత్రధారులు ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని  ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Continues below advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా ప్రతినిధులతో వివరాలు వెల్లడించారు.  ఈ వ్యవహారంలో సిట్ ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, అందులోని పూర్తి వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికీ కొన్ని సిఫారసులు చేసిందన్నారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను నీరుగార్చి, కల్తీకి పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, అందుబాటులో ఉన్న ఆధారాలతోనే ఆ రోజు మాట్లాడారని స్పష్టం చేశారు.

లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత పరీక్షల్లో  S-వాల్యూ లో తేడాలు రావడం వల్లే ఎన్‌డిడిబి (NDDB)కి అనుమానం కలిగిందని, పరీక్షల్లో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లార్డ్ ఉన్నట్లు తేలిందని మంత్రి స్పష్టం చేశారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2022లోనే దీనిపై నివేదిక వచ్చినా, అప్పటి వైసీపీ ప్రభుత్వం మ, టీటీడీ బోర్డు ఆ విషయాన్ని తొక్కిపెట్టాయని ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి సేకరణలో ఉన్న మూడు కఠిన నిబంధనలను వైసీపీ ప్రభుత్వం కావాలనే తొలగించిందని, ఇందులో దుర్మార్గమైన కుట్ర దాగి ఉందన్నారు. 

Continues below advertisement

బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలే బాబా వంటి సంస్థలు, వైష్ణవి డైరీ పేరుతో మరో సంస్థతో టైఅప్ పెట్టుకుని నకిలీ పత్రాలతో కాంట్రాక్టు దక్కించుకున్నాయని పయ్యావుల వెల్లడించారు. టెండర్ల సమయంలో అధికారులు కళ్ళు మూసుకుని వీరికి సహకరించారని, పామాయిల్ అధిక మొత్తంలో కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ఆధారాలు లభించాయని తెలిపారు. వైష్ణవి డైరీ సమర్పించినవన్నీ ఫేక్ డాక్యుమెంట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కల్తీలో అప్పటి టీటీడీ చైర్మన్లు, అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.   

తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్ట్ సిఫార్సు చేసిందని ఇందులో భాగంగా బాలాజీ, అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వీరితో పాటు వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలను కూడా నేరస్తులుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే వీరందరిని విచారించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.