AP BJP On Rayalaseema :   నేతలు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా ఎదిగినా ఆ ప్రాంతం వెనుకబడే ఉందని.. దీనికి ప్రాంతీయ పార్టీలే కారణమని బీజేపీ అంటోంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉంటారు. ఈ ప్రాంతం అభివృద్ధి మాత్రం జరగదు. ఇంకొకసారి అవకాశం వస్తే మేము అభివృద్ధి చేస్తాం అంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపం వీరి ఓట్లు వేయడమా ? అని ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రాంతీయ పార్టీలను నిలదీయాల్సి సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. 


రాయలసీమ సమస్యలపై మొదటి నుంచి దూకుడుగా ఉన్న ఏపీ బీజేపీ 


రాయలసీమ సమస్యలపై బీజేపీ నేతలు మొదటి నుంచి దూకుడుగా ఉంటున్నారు. కర్నూలులో హైకోర్టుకు బీజేపీ మదద్దతు పలికింది.  రాయలసీమకు ప్రయోజనం చేకూర్చే సాగునీటి పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గతంలో ఏపీ బీజేపీ నేతలు పోరాడారు.  హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి తోటపల్లి , లాంటి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారని ఆందోళనలు చేశారు. రాయలీసమలో  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని  వైసీపీలో  పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేయలేదని బీజేపీ నేతలంటున్నారు.   


రాయలసీమలో బలపడేందుకు ప్రత్యేక దృష్టి -త్వరలో అమిత్ షా టూర్ 


రాయలసీమలో బలపడేందుకు మంచి అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.  దీంతో తమకు కాస్త ఆదరణ ఉన్న ప్రాంతాలలో మరింత పట్టు సాధించాలనే వ్యూహానికి బిజెపి తెర తీసింది.దీనిలో భాగంగానే రాయలసీమ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలోనే పర్యటించనున్నారు. నిజానికి గత నెలలోనే అమిత్ షా పర్యటించాల్సి ఉంది. చివరి క్షణంలోవాయిదా పడింది.   ఉత్తరాంధ్రతో పాటు , ఉభయగోదావరి జిల్లాల్లోనూ బిజెపికి ఆదరణ ఉంటుందని, ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.దీంతో ఆయా ప్రాంతాల్లోనూ బిజెపి అగ్రనేతల పర్యటనలు, సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.


పొత్తులతో సంబంధం లేకుండా బలపడేందుకు ప్రయత్నం 


2024 నాటికి బలమైన శక్తిగా బిజెపి ని తీర్చిదిద్దాలనే పట్టుదల ఆ పార్టీ అధిష్టానంలో కనిపిస్తోంది.2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా పోటీకి దిగబోతుండడంతో, బీజేపీ మరింతగా ఏపీ పై ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తోంది.ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించకుండా.. గ్రామ స్థాయిలో ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ది గురించి వివరించి..బలపడాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా త్వరలో గ్రామ స్థాయిలో సభలు ఏర్పాటు చేయనున్నారు.