అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చ నేడు మొదలుకానుంది. ప్రభుత్వం నేడు మూడు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ చట్టాల్లో రెండు సవరణ బిల్లులను మంత్రి నారాయణ, విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందు ఉంచనున్నారు. మధ్యాహ్నం నుండి బడ్జెట్‌పై సమగ్ర చర్చ ప్రారంభమవుతుంది.

Continues below advertisement

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రసంగించనుండగా, ఎల్లుండి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీలో తొలుత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ సెషన్‌లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో జరిగిన పనుల్లో అవకతవకలు, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. అలాగే ఆక్వా రైతులందరికీ ఏకరీతి విద్యుత్ రాయితీ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణం, హజ్ యాత్రికుల సమస్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సభలో చర్చించనున్నారు.

మరోవైపు, ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసనమండలిలో కూడా బడ్జెట్‌పై తొలిరోజు చర్చ జరగనుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం అమలు, యురేనియం గనుల తవ్వకం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆసుపత్రుల్లో మందుల నాణ్యత, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం వంటి ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై మండలిలో మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.

Continues below advertisement